న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీపై తానేమి ఆధారపడలేదని టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. అనుభవం కలిగిన ఆటగాడిగా ధోనీ తనకు సూచనలు చేసేవాడని, అది జట్టులో భాగమని తెలిపాడు. ఇక వికెట్ల వెనుకాల ఉంటూ ధోనీ బౌలర్లతో వ్యూహాలు రచిస్తూ బ్యాట్స్మెన్ను బోల్తా కొట్టించడం తెలిసిందే. బౌలర్లకు అతను చేసే సూచనలు చాలా సార్లు స్టంప్ మైక్స్లో కూడా రికార్డు అయ్యాయి.
తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుల్దీప్ ముందు ఈ విషయాన్ని ప్రస్తావించగా.. తాను ధోనీపై ఆధారపడ్డానా లేదా? అనే విషయం ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. తానేంటో నిరూపించుకోవాల్సింది కూడా ఏం లేదని చెప్పాడు.
'అవును.. మహీ భాయ్ ఎప్పుడూ నన్ను గైడ్ చేస్తుంటాడు. ఎందుకంటే ఓ వికెట్ కీపర్ బౌలర్లను బాగా జడ్జ్ చేయగలడు. అనుభవజ్ఞుడైన మహీ భాయ్కు ఏ బ్యాట్స్మన్ ఎలా ఆడుతాడో బాగా తెలుసు. ఇవన్నీ టీమ్ వర్క్లో భాగమే. ఇక ప్రపంచకప్ అనంతరం మహీ భాయ్ ఆడలేదు. నేనేంటో నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాగే ధోనీపై ఆధారపడ్డానా? లేదా? అని కూడా చెప్పాల్సిన పనిలేదు. నా ఆటను మరింత మెరుగుపర్చుకోవడమే నా ముందున్న కర్తవ్యం.
మణికట్టు స్పిన్ అంత సులువు కాదు. గత కొన్నేళ్లుగా చహల్-నేను అద్భుతంగా రాణిస్తున్నాం. కానీ ప్రపంచకప్ తర్వాత మేం ఇద్దరం కలిసి ఆడింది లేదు. టీమ్ కాంబినేషన్స్ వల్ల అవకాశం దక్కలేదు. జట్టు అవసరాలకు అనుగునంగానే ఆటగాళ్లు కూడా మారాలి'అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.
అండర్వేర్లో టిష్యూ పేపర్లు పెట్టుకొని ఆడిన సచిన్!