
హమిల్టన్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో కివీస్ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. రాస్ టేలర్ (109 నాటౌట్) అజేయ సెంచరీతో కదం తొక్కడంతో 348 పరుగుల భారీ లక్ష్యం కూడా చిన్నబోయింది. ఈ గెలుపులో న్యూజిలాండ్ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఇక, ఈ మ్యాచ్లో భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ను ఆతిథ్య బ్యాట్స్మెన్ ఓ ఆటాడుకున్నారు. బౌండరీల మోత మోగిస్తూ పరుగులు పిండుకున్నారు. మొత్తంగా 10 ఓవర్లు వేసిన కుల్దీప్ రెండు వికెట్లు తీసి 84 పరుగులు సమర్పించుకున్నాడు. ఫలితంగా వన్డేల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న మూడో భారత స్పిన్నర్గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
ఇక గతేడాది బర్మింగ్హామ్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 88 పరుగులు ఇచ్చుకోని అగ్ర స్థానంలో ఉన్నాడు. 2008లో ఢాకాలో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో పీయూష్ చావ్లా 85 పరుగులు ఇచ్చుకొని ఈ చెత్త రికార్డు జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పుడు కుల్దీప్ చిత్తయి మూడో బౌలర్గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్లో 9 ఓవర్లు వేసిన శార్దుల్ ఠాకుర్ 80 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. యువ బ్యాట్స్మన్ శ్రేయాస్ అయ్యర్ (107 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో తొలి సెంచరీతో సాధించగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (51; 63 బంతుల్లో 6 ఫోర్లు), లోకేష్ రాహుల్ (88 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిసారు. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా.. గ్రాండ్ హోమ్, ఇష్ సోదీ చెరొక వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 48.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసి విజయాన్నందుకుంది. టేలర్ అజేయ సెంచరీకి తోడు నికోలస్(78), స్టాండ్ కెప్టెన్ టామ్ లాథమ్(69) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ రెండు వికెట్లు తీయగా.. షమీ, ఠాకుర్ చెరొక వికెట్ తీశారు.