టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సహకారంతోనే ఇంగ్లండ్తో చివరి టెస్ట్లో ఐదు వికెట్ల ఘనతను అందుకున్నానని కుల్దీప్ యాదవ్ తెలిపాడు. తన కష్టానికి దక్కిన ప్రతిఫలం ఈ ప్రదర్శనని చెప్పిన కుల్దీప్.. పేస్ను మెరుగుపరుచుకోవడం ఉపయోగపడిందన్నాడు. ధర్మశాల వేదికగా గురువారం ప్రారంభమైన చివరి టెస్ట్లో కుల్దీప్ యాదవ్(5/72) ఐదు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.
అతని ధాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ జాక్ క్రాలీ(108 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 79)అంతా విఫలమయ్యారు. కుల్దీప్ తన సంచలన బౌలింగ్తో జాక్ క్రాలీతో పాటు బెన్ డక్కెట్, ఓలీ పోప్(11), జానీ బెయిర్ స్టో(26), బెన్ స్టోక్స్(0)లను పెవిలియన్ చేర్చాడు.

తొలి రోజు ఆట అనంతరం తన ప్రదర్శనపై మాట్లాడిన కుల్దీప్ యాదవ్.. అశ్విన్ సూచనలు ఉపయోగపడ్డాయని చెప్పాడు. 'నా గేమ్ను నేను ఆస్వాదించాను. నిజాయితీగా చెప్పాలంటే 2021లో సర్జరీ జరిగిన అనంతరం నేను చాలా కష్టపడ్డాను. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ ప్రదర్శన. ముఖ్యంగా నా పేస్పై ఫోకస్ పెట్టాను.
భారత్లో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు బంతులు వేగంగా వేయడం చాలా ముఖ్యం. ప్రస్తుతం నేను నా బౌలింగ్ను ఆస్వాదిస్తున్నాను. నేను తీసిన ఐదు వికెట్లలో జాక్ క్రాలీని ఔట్ చేయడం సంతోషాన్నిచ్చింది. ఎందుకంటే ఈ సిరీస్లో అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. స్పిన్ను బాగా ఆడగలడు.
వికెట్ గురించి ఆలోచించకుండా నా నైపుణ్యం, వేరియేషన్, లెంగ్త్పైనే ఫోకస్ పెడుతాను. వికెట్ ఎలా ఉందనే విషయాన్ని అస్సలు పట్టించుకోను.
సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేయడంపైనే ఫోకస్ పెడుతాను. నా చిన్నప్పుడు బ్యాటర్లను ఎలా ఔట్ చేయాలని అతిగా ఆలోచించేవాడిని. స్పిన్నర్గా పరిణితి చెందినా కొద్దీ లెంగ్త్పై ఫోకస్ పెట్టాను.
ఓలి పోప్ కాస్త ముందుగానే స్టెప్ ఔట్ అయ్యాడు. అప్పటికే ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్.. అతను స్టెప్ అవుతున్నాడని చెప్పారు. అతను సౌకర్యవంతగా లేడన్నారు. అందుకు తగ్గట్లు బౌలింగ్ చేసి వికెట్ దక్కించుకున్నాను. అశ్విన్ భాయ్ మైదానంలో కొన్ని సూచనలతో పాటు సలహాలు ఇచ్చాడు.'అని కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(5/72), 100వ టెస్ట్ హీరో రవిచంద్రన్ అశ్విన్(4/51) ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. జడేజాకు ఓ వికెట్ దక్కింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 57), రోహిత్ శర్మ(83 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 52 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో రాణించారు.
శుభ్మన్ గిల్(26 బ్యాటింగ్), రోహిత్ శర్మ క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్కు ఓ వికెట్ దక్కింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 83 పరుగుల వెనుకంజలో ఉంది