ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ దుమ్మురేపుతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో అత్యుత్తమ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ అందుకున్నాడు. యూఏఈపై 4 వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. 3 వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించాడు. ఈ అత్యుత్తమ ప్రదర్శన క్రెడిట్ అక్షర్ పటేల్దేనని కుల్దీప్ యాదవ్ తెలిపాడు. పాకిస్థాన్తో విజయానంతరం బీసీసీఐ టీవీతో మాట్లాడిన కుల్దీప్ యాదవ్.. అక్షర్ పటేల్ ఇచ్చిన సలహాలతోనే వికెట్లు తీయగలిగానని చెప్పాడు. తన కెప్టెన్ అక్షర్ పటేలేనని పేర్కొన్నాడు.
'అక్షర్ పటేల్ నా కెప్టెన్. ఈ వికెట్పై బంతి గ్రిప్ అవ్వడంతో పాటు స్పిన్ అవుతుందని అతనే చెప్పాడు. ఆ మాటలు నా మనసులో నాటుకుపోయాయి. అప్పటికీ నేను ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాను. బంతిని స్పిన్ చేయాలని ప్రయత్నించాను. కానీ బౌన్స్ లభించింది. అప్పటికే అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీసాడు. నేను మూడు వికెట్లు పడగొట్టాను. ఇద్దరం కలిసి మేం ఐదు వికెట్లు పడగొట్టాం. ఇది జట్టు విజయానికి బాటలు వేసింది.

నా అత్యుత్తమ ప్రదర్శన క్రెడిట్ అక్షర్ పటేల్కే ఇవ్వాలి. ఈ రోజు అతను కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బౌలింగ్ కండిషన్స్ గురించి తెలుసుకోవడంతోనే ఎలా చేయాలనే ఆలోచన అక్షర్కు వచ్చిందేమో. గత మ్యాచ్ తరహాలోనే ప్రతీ గేమ్లో వికెట్ భిన్నంగా ఉండనుంది. గత మ్యాచ్లో నా బౌలింగ్ వేగం బ్యాటర్లకు సులువు అవుతుందని భావించాను. ఈ విషయాన్ని ముందే గ్రహించి తొలి ఓవర్లోనే నెమ్మదిగా బౌలింగ్ చేయడంతో పాటు రివర్స్ చేశాను. ఆ వ్యూహం పనిచేసింది.
సుదీర్ఘ కాలం తర్వాత ఆడినప్పుడు గొప్ప అనుభూతి కలుగుతోంది. ఇంగ్లండ్ పర్యటనలో నాకు అవకాశం రాకున్నా.. నా ప్రాక్టీస్ను ఆపలేదు. ఫిట్నెస్పై కూడా ఫోకస్ పెట్టాను. స్పిన్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఆసియా కప్లో అవకాశం దక్కుతుందని నాకు ముందే తెలుసు. ఆ రిథమ్ కోల్పోకుండా కష్టపడ్డాను. ఆ కష్టానికి ప్రతి ఫలం దక్కుతుంది.'అని కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు.