ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా విజేతగా నిలవడంలో కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. 7 మ్యాచ్ల్లో 9.29 సగటుతో 17 వికెట్లు పడగొట్టి ఈ టోర్నీ హయ్యెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థుల పతనాన్ని శాసించాడు. పాకిస్థాన్తో జరిగిన ఫైనల్లోనూ(4/30) నాలుగు వికెట్లతో మ్యాచ్ను మలుపు తిప్పాడు. అయితే ఈ టోర్నీకి ముందు దులీప్ ట్రోఫీ ఆడటం వల్లే ఆసియా కప్ 2025 టోర్నీలో మెరుగ్గా రాణించగలిగానని కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఒక్క మ్యాచ్ ఆడని కుల్దీప్ యదవ్.. దులీప్ ట్రోఫీ ద్వారా రిథమ్ అందుకున్నానని చెప్పాడు. ఫైనల్ అనంతరం రింకూ సింగ్తో కలిసి బీసీసీఐ టీవీతో మాట్లాడాడు.
'ఏ బౌలర్కు అయినా చాలా కాలంగా క్రికెట్ ఆడనప్పుడు రిథమ్ అందుకోవడం కీలకం. నాకైతే చాలా ముఖ్యం. దాని కోసం నేను దులీప్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఆడాను. అందులో నేను చాలా ఎక్కువగా బౌలింగ్ చేశాను. అందుకే ఈ టోర్నీకి వచ్చేసరికి నా బౌలింగ్ మెరుగైంది. మిడిల్ ఓవర్లలో పరుగులు నియంత్రించడం, వికెట్లు తీయడం నా బాధ్యత. ఈ విషయంలో మా కెప్టెన్కు నాపై చాలా నమ్మకం ఉంది. నా బాధ్యతను నేను చాలా బాగా నిర్వర్తించాను. నాకు స్థిరమైన లక్ష్యాలు ఏం లేవు. అవకాశం వచ్చినప్పుడల్లా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడం, జట్టు విజయానికి సహకరించడమే నా పని.'అని కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

టీమ్మేనేజ్మెంట్ ఇచ్చిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించినందుకు సంతోషంగా ఉందని టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ తెలిపాడు. 'టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్య నాపై పెద్ద బాధ్యతను పెట్టారు. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయించారు. వారిచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాను. పాకిస్థాన్తో ఫైనల్లో వికెట్లు తీయడానికి సంజూ శాంసన్ సహాయం చేశాడు. అతని సూచనలతోనే వికెట్లు తీసాను.'అని వరుణ్ చక్రవర్తీ చెప్పుకొచ్చాడు.