సౌతాఫ్రికాతో జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత బౌలర్లు దుమ్మురేపారు. కుల్దీప్ యాదవ్(4/41) నాలుగు వికెట్లతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. క్వింటన్ డికాక్(89 బంతుల్లో 6 ఫోర్లతో 106) సెంచరీతో చెలరేగగా.. టెంబా బవుమా(67 బంతుల్లో 5 ఫోర్లతో 48) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ నాలుగేసి వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికాకు తొలి ఓవర్లోనే బిగ్ షాక్ తగిలింది. అర్ష్దీప్ సింగ్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే ర్యాన్ రికెల్టన్(0) కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. దాంతో ఒక్క పరుగుకే సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ టెంబా బవుమాతో కలిసి డికాక్ జట్టును ఆదుకున్నాడు. ఆచితూచి ఆడిన ఈ జోడీ క్రీజులో సెట్ అయ్యేందుకు సమయం తీసుకుంది. దాంతో పవర్ ప్లేలో సౌతాఫ్రికా వికెట్ నష్టానికి 42 పరుగులే చేసింది.

అయితే ప్రసిధ్ కృష్ణ వేసిన 11వ ఓవర్లో డికాక్ వరుసగా రెండు సిక్స్లు, బౌండరీ బాది దూకుడు పెంచాడు. అదే జోరును కొనసాగించిన డికాక్.. జడేజా బౌలింగ్లో సిక్స్బాది 42 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవైపు డికాక్ దూకుడుగా ఆడగా.. మరోవైపు బవుమా ఆచితూచి ఆడాడు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జడేజా విడదీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన బవుమా(48)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 113 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
బవుమా ఔటైనా.. డికాక్ తన జోరును కొనసాగించాడు. అతనికి తోడుగా బ్రీట్జ్కే కూడా వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్రీట్జ్కేను ప్రసిధ్ కృష్ణ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ ఓవర్లోనే ఎయిడెన్ మార్క్రమ్(1) కూడా ఔటవ్వగా.. డెవాల్డ్ బ్రెవిస్ సాయంతో 80 బంతుల్లో డికాక్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ అనంతరం డికాక్ను ప్రసిధ్ కృష్ణ క్లీన్ బౌల్డ్ చేశాడు.
క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసిన డెవాల్డ్ బ్రెవిస్(19)ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కార్బిన్ బోష్(9), లుంగి ఎంగిడి(1) ఔటవ్వగా.. కేశవ్ మహరాజ్(20 నాటౌట్) పోరాడే ప్రయత్నం చేయగా.., బార్ట్మన్(3)ను క్లీన్ బౌల్డ్ చేసిన ప్రసిధ్ కృష్ణ సఫారీ ఇన్నింగ్స్కు తెరదించాడు.