ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్లోనూ వెనుకంజలో నిలిచిన టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. హోబర్ట్ వేదికగా ఆదివారం జరిగే మూడో టీ20లో ఆతిథ్య ఆసీస్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 వర్షార్పణం కాగా.. రెండో టీ20లో ఆసీస్ 4 వికెట్ల తేడాతో భారత్ను చిత్తు చేసింది. చెత్త బ్యాటింగ్ భారత్ 125 పరుగులే చేయగా.. ఆసీస్ మరో 40 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
పరిస్థితులు అంచనా వేయకుండా దూకుడుగా ఆడటం టీమిండియాకు నష్టం చేసింది. పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోవడంతో కోలుకోలేకపోయింది. ఈ క్రమంలోనే మూడో టీ20లో విజయం సాధించి సిరీస్ రేసులో నిలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం మూడో టీ20 కూడా గెలిచి సిరీస్పై పట్టు సాధించాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రెండో టీ20 ఓటమి నేపథ్యంలో టీమిండియా కాంబినేషన్లో మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా టాప్ టీ20 బౌలర్ అర్ష్దీప్ సింగ్ను కాదని హర్షిత్ రాణాను తొలి రెండు టీ20లు ఆడించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. బ్యాటింగ్ డెప్త్ కోసం హర్షిత్ రాణాను ఆడించిన టీమిండియా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. రెండో టీ20లో హర్షిత్ రాణా బ్యాట్తో రాణించినా బౌలింగ్లో తేలిపోయాడు. ఈ క్రమంలో హర్షిత్ రాణాను తప్పించి అతని స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను ఆడించే ఛాన్స్ ఉంది.
రెండో టీ20లో ధారళంగా పరుగులిచ్చిన కుల్దీప్ యాదవ్ను తప్పించి అర్ష్దీప్ సింగ్ను ఆడించవచ్చు. పిచ్లు పేస్, బౌన్స్కు అనుకూలంగా ఉండటంతో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు అవసరం లేదనే అభిప్రాయం కలుగుతోంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ సత్తా చాటుతుండటంతో కుల్దీప్ యాదవ్ను బెంచ్కు పరిమితం చేయడమే ఉత్తమమనిపిస్తుంది. ఒకవేళ కుల్దీప్ యాదవ్ను కొనసాగించాలనుకుంటే హర్షిత్ రాణా స్థానంలో అర్ష్దీప్ సింగ్ బరిలోకి దిగుతాడు.
బ్యాటింగ్లో విఫలమైనా పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ బరిలోకి దిగనున్నారు. రెండో టీ20లో బ్యాటర్లంతా విఫలమైన వేళ అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం చేశాడు. శుభ్మన్ గిల్ కూడా చెలరేగాల్సి ఉంది. ఈ ఇద్దరూ పవర్ ప్లే పూర్తయ్యే వరకు క్రీజులో ఉంటే టీమిండియాకు తిరుగుండదు.
మూడో స్థానంలో బరిలోకి దిగిన సంజూ శాంసన్ తీవ్రంగా నిరాశపర్చాడు. అతను తన సత్తా చాటాల్సిన అవసరం ఉంది. తొలి టీ20లో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్.. రెండో టీ20లో మాత్రం రాణించలేకపోయాడు. అతను కూడా సత్తా చాటాల్సి ఉంది. తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్ కూడా చెలరేగాల్సి ఉంది. స్పెషలిస్ట్ పేసర్గా బుమ్రా సత్తా చాటగా అతనికి అర్ష్దీప్ సింగ్ అండగా నిలవనున్నాడు.
శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్/హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్/అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా