ఇంగ్లండ్ పర్యటనను విజయంతో ముగించిన టీమిండియాకు 35 రోజుల విశ్రాంతి లభించింది. ఆసియా కప్ 2025తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టనుంది. సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరగనుంది. మొత్తం 8 జట్లు బరిలోకి దిగనుండగా.. అబుదాబి, దుబాయ్ వేదికగా 19 మ్యాచ్లు జరగనున్నాయి. సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈతో జరిగే మ్యాచ్తో టీమిండియా ఆసియాకప్ క్యాంపైన్ను మొదలు పెట్టనుంది. సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తలపడనుంది.సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్తో ఈ టోర్నీకి తెరపడనుంది.
ఈ విశ్రాంతి సమయాన్ని టీమిండియా ఆటగాళ్లంతా కుటుంబ సభ్యులతో గడుపుతుండగా.. సెలెక్టర్లు మాత్రం ఆసియాకప్ 2025 కోసం ఎంపిక చేసే జట్టుపై ఫోకస్ పెట్టారు. ఐపీఎల్ 2025 సీజన్తో పాటు ఇంగ్లండ్ పర్యటనలో ఆటగాళ్ల ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్నారు. గతంలో విశ్రాంతి పేరిట ప్రథమ శ్రేణి ఆటగాళ్లందర్నీ టీ20 ఫార్మాట్కు దూరం పెట్టారు. దాంతో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఐపీఎల్ స్టార్స్ అవకాశాలు అందుకున్నారు. కానీ ఇప్పుడు ప్రథమ శ్రేణి ఆటగాళ్లను కూడా ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికే టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేర్లను సెలెక్షన్ కమిటీ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఐపీఎల్లో సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్ కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా పేరును కూడా సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అతని బ్యాటింగ్ సామర్థ్యం, టీ20 శైలికి సరిపోయే బౌలింగ్ అదనపు అడ్వాంటేజ్గా మారిందని ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది.
టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్.. బ్యాటింగ్ డెప్త్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని, ఈ క్రమంలోనే కృనాల్ను ఎంపిక చేస్తారనే చర్చ జరుగుతోంది. ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ తరఫున బరిలోకి దిగిన కృనాల్ పాండ్యా.. 8.24 ఎకానమీతో 17 వికెట్లు తీసాడు. బ్యాటింగ్లో ఒక హాఫ్ సెంచరీ(73*) సాయంతో 109 పరుగులు చేశాడు. లోయరార్డర్లో విలువైన పరుగులు జోడించాడు. ఈ ప్రదర్శన నేపథ్యంలోనే కృనాల్ను భారత జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 ప్రదర్శనను పరిగణలోకి తీసుకొనే జట్టును ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.