చెన్నై: ముంబై ఇండియన్స్ చేతిలో ఎదురైన ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కృనాల్ పాండ్యా అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సమష్టిగా విఫలమైన లక్నో 81 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన కృనాల్ పాండ్యా.. తన బ్యాటింగ్ వైఫల్యం వల్లే జట్టుకు ఈ ఘోర పరాజయం ఎదురైందన్నాడు.
తాను ఆ షాట్ ఆడాల్సింది కాదని, తన వికెట్తోనూ లక్నో పతనం మొదలైందన్నాడు. 'లక్ష్యచేధనలో ఆరంభంలో వికెట్లు కోల్పోయినా స్టోయినీస్ సూపర్ బ్యాటింగ్తో 69/2తో మంచి స్థితిలో నిలిచాం. కానీ ఈ సమయంలో నేను ఆడిన చెత్త షాట్ మా పతనానికి ఆరంభమైంది. ఆ షాట్ నేను ఆడాల్సింది కాదు. ఈ ఘోర పరాజయానికి పూర్తి బాధ్యత నాదే. నా వల్లే గెలిచే మ్యాచ్లో లక్నో ఓడింది.

వికెట్లో ఎలాంటి మార్పు లేదు. మేం కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. బాధ్యతాయుతంగా ఆడాల్సింది. కానీ మేం అలా ఆడలేకపోయాం. ముఖ్యంగా ఫస్ట్ టైమ్ ఔట్ బ్రేక్ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయాం. కైల్ మేయర్స్, క్వింటన్ డికాక్లో ఎవర్నీ ఆడించాలనేది కాస్త కఠిన నిర్ణయమే. అయితే చెన్నైలో డికాక్ కంటే కైల్ మేయర్స్కు మంచి రికార్డు ఉండటంతో అతన్నే ఆడించాం. కొత్తగా చేయాలనే ఆరంభంలో స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించాను.'అని కృనాల్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 182 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్(23 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 41), సూర్యకుమార్ యాదవ్(20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 33) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
తిలక్ వర్మ(22 బంతుల్లో 2 సిక్స్లతో 26), ఇంపాక్ట్ ప్లేయర్ నెహాల్ వధేరా(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 23) మెరుపులు మెరిపించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్కు తోడుగా .. యశ్ థాకూర్ మూడు వికెట్లు, మోహ్సిన్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నోసూపర్ జెయింట్స్ 16.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. మార్కస్ స్టోయినీస్(27 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 40) మినహా అంతా విఫలమయ్యారు. ముగ్గురు బ్యాటర్లు రనౌటవ్వడం లక్నో పతనాన్ని శాసించింది. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ (5/5) ఐదు వికెట్ల ఘనత అందుకోగా.. క్రిస్ జోర్డాన్, పియూష్ చావ్లా చెరో వికెట్ తీసారు