
హైదరాబాద్: పాండిచ్చేరి టీ10 లీగ్లో భారత యువ క్రికెటర్ కృష్ణ పాండే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 6 బంతుల్లో 6 సిక్స్లు బాది టీ10 క్రికెట్లో ఈ ఘనతను సాధించిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. పుదెచ్చేరీ వేదికగా జరుగుతున్న ఈ టీ10 లీగ్లో పాట్రియోట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణ పాండే రాయల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ సాధించాడు.
టీ20 క్రికెట్లో టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువ రాజ్ సింగ్ తొలిసారి ఈ ఘనతను అందుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో స్టువర్డ్ బ్రాడ్ బౌలింగ్ను ఉతికారేసాడు. ఇక చివరిసారిగా వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్.. శ్రీలంకపై ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాత మరెవరూ కూడా ఈ ఘనతను అందుకోలేదు.
పొలార్డ్ తర్వాత 6 బంతుల్లో 6 సిక్స్లు కొట్టిన బ్యాటర్గా కృష్ణ పాండే నిలిచాడు. నితేశ్ ఠాకూర్ బౌలింగ్లో కృష్ణ పాండే ఈ ఘనతను అందుకున్నాడు. మిడ్ వికెట్, బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా పాండే సిక్స్లు బాదాడు. పాండే ఫీట్తో డగౌట్లో ఉన్న ఆటగాళ్లంతా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఈ మ్యాచ్లో 19 బంతుల్లో 12 సిక్స్లు, 2 ఫోర్లు 83 పరుగులతో పాండే విధ్వంసం సృష్టించాడు. అతని స్ట్రైక్రేట్ 436గా ఉండటం విశేషం. అయితే కృష్ణ పాండే ఇంత ధాటిగా ఆడినా తన జట్టు పాట్రియోట్స్ను గెలిపించలేకపోయాడు. అతని జోరుకు అరవింద్ రాజ్ అనే బౌలర్ కళ్లెం వేయడంతో పాట్రియోట్స్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ రఘపతి(84) రాణించాడు. అనంతరం పాట్రియోస్ 153 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.