టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం వెనుక భారీ కుట్ర ఉందని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆరోపించాడు. హార్దిక్ కెప్టెన్సీ వేటుకు సంబంధించి సెలెక్టర్లు చెప్పిన కారణాలు సహేతుకంగా లేవని అభిప్రాయపడ్డాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్, ఆటగాళ్ల ఫిర్యాదుతోనే హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి ఉండవచ్చన్నాడు.
టీ20 ప్రపంచకప్ విజయానంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దాంతో వైస్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యా.. రోహిత్ వారసుడిగా టీమిండియా టీ20 సారథ్య బాధ్యతలు చేపడుతాడని అంతా అనుకున్నారు. కానీ నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా ఎంపిక చేశాడు.

శ్రీలంక పర్యటనతో సూర్య సారథ్య బాధ్యతలు చేపడుతాడని, 2026 టీ20 ప్రపంచకప్ వరకు జట్టును నడిపిస్తాడని స్పష్టం చేశాడు. హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సమస్యల నేపథ్యంలోని ఈ నిర్ణయం తీసుకున్నామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వివరణ ఇచ్చాడు. అయితే ఈ వివరణపై కృష్ణమాచారి శ్రీకాంత్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ కారణాలు నమ్మశక్యంగా లేవన్నాడు. వేరే కారణాలతోనే అతనిపై వేటు వేసారని సందేహం వ్యక్తం చేశాడు.
'హార్ది పాండ్యాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చిన ఫిర్యాదుతోనే సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ఈ నిర్ణయానికి హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ ఏ మాత్రం కాదు. ఐపీఎల్ మొత్తం ఆడిన హార్దిక్.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. కానీ టీ20 ప్రపంచకప్లో అద్భుతంగా రాణించి జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.
వైస్ కెప్టెన్గా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాడు. అలాంటి పాండ్యాను కెప్టెన్సీ నుంచి తొలగించడం ఆశ్చర్యానికి గురి చేసింది. సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్ అయ్యేందుకు అన్నీ అర్హతలు ఉన్నాయి. అయితే హార్దిక్ పాండ్యాను తొలగించిన విధానం మాత్రం నచ్చలేదు. అతనికి అసలు విషయం సూటిగా చెప్పాల్సింది.
గతంలో నేను సెలెక్షన్ కమిటీ ఛైర్మన్గా పని చేశాను. ఎంతో మంది ఆటగాళ్లను ఎంపిక చేశాను. కొందరిని పక్కనపెట్టి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. నేను మంచి సెలెక్టర్నని చెప్పడం లేదు. ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు. అయితే ఎవరినైనా జట్టు నుంచి తప్పించినా.. కీలక నిర్ణయం తీసుకున్నా సరైన వివరణ ఇవ్వాలి.'అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్లో జులై 27 నుంచి ప్రారంభం కానుంది.