టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్పై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇగోకు పోతే జట్టులో చోటు ఉండదని హెచ్చరించాడు. యశస్వి జైస్వాల్ జట్టులోకి వస్తే మళ్లీ అవకాశం కూడా రాదన్నాడు. ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్లో సంజూ శాంసన్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఐదు ఇన్నింగ్స్ల్లో సంజూ 51 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఈ ఐదు ఇన్నింగ్స్ల్లో ఒకే రకమైన బంతి, ఒకే స్థానం, ఒకే షాట్, ఒకే పొరపాటు, ఒకే విధంగా ఔటయ్యాడు. షార్ట్ పిచ్ బాల్స్ను పుల్ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా ఓ ఛానెల్తో మాట్లాడిన క్రిష్ శ్రీకాంత్.. ఇకనైన సంజూ శాంసన్ షాట్ల ఎంపికలో జాగ్రత్త వహించాలన్నాడు. లేకుంటే జట్టులో చోటు గల్లంతయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. 'సంజూ శాంసన్ తనకు వచ్చిన అవకాశాలను పూర్తిగా వృథా చేసుకున్నాడు. ఐదో టీ20లో కూడా పుల్ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. నాకు తెలిసి అతను ఇగోను సంతృప్తి పరుచుకునేందుకు పదే పదే ఆ షాట్ ఆడాడని అనుకుంటున్నా. ఈ షాట్ కచ్చితంగా ఆడగలను. నాకు బలహీనత కాదని చెప్పే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. అతను సూపర్ ఫామ్లో ఉండి కూడా ఇగోకు పోయి వికెట్ పారేసుకున్నాడు. ఈ సిరీస్లో తీవ్రంగా నిరాశపరిచాడు.

ఈ తరహా మైండ్ సెట్ ఉండటంతోనే సంజూ శాంసన్ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు. అతను ఇలానే విఫలమైతే.. సెలెక్టర్లు అతనిపై మరోసారి వేటు వేయనున్నారు. యశస్వి జైస్వాల్ అతని స్థానాన్ని భర్తీ చేస్తాడు. తదుపరి టీ20 మ్యాచ్లో సంజూ శాంసన్ను కాదని యశస్వి జైస్వాల్ను ఆడిస్తారు.'అని సంజూ శాంసన్ను శ్రీకాంత్ హెచ్చరించాడు.
మరోవైపు సంజూ శాంసన్ గాయంతో ఆరు వారాల పాటు ఆటకు దూరమయ్యాడు. మళ్లీ ఐపీఎల్ 2025 సీజన్లోనే అతను బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇంగ్లండ్తో ఐదో టీ20లో జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి సంజూ కుడి చేతి చూపుడు వేలుకు బలంగా తాకింది. దాంతో అతని వేలు విరిగిందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.