టీమిండియా యువ బ్యాటర్ శుభ్మన్ గిల్పై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. గిల్ ఓవర్రేటెడ్ ప్లేయర్ అని అభిప్రాయపడ్డాడు. భారత జట్టులో శుభ్మన్ గిల్కు చోటు దండుగని, అతని కంటే ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉన్నా సెలెక్టర్లు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభ్మన్ గిల్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఐదు ఇన్నింగ్స్ల్లో అతను 93 పరుగులు మాత్రమే చేశాడు. సొంతగడ్డపై మెరుగైన ప్రదర్శన చేస్తున్న గిల్.. ఓవర్సీస్ కండీషన్స్లో మాత్రం రాణించలేకపోతున్నాడు.

ఆస్ట్రేలియాతో ఐదో టెస్ట్లో గిల్ కోసం రోహిత్ శర్మ జట్టు నుంచి తప్పుకున్నాడు. కానీ గిల్ మాత్రం రెండు ఇన్నింగ్స్ల్లో నిర్లక్ష్యపు షాట్లతో పెవిలియన్ చేరాడు. గిల్తో పాటు ఇతర బ్యాటర్లు కూడా విఫలమవడంతో ఈ సిరీస్ను భారత్ 1-3తో ఆసీస్కు కోల్పోయింది. ఈ ఘోర పరాజయంతో టీమిండియాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలోనే శుభ్మన్ గిల్ ప్రదర్శనపై మాట్లాడిన 1983 ప్రపంచకప్ విన్నర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. ఘాటు వ్యాఖ్యలు చేశాడు. శుభ్మన్ గిల్ కంటే సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ ఎంతో నయమని అభిప్రాయపడ్డాడు.

'శుభ్మన్ గిల్ ఓవర్ రేటెడ్ క్రికెటర్. అతనికి అంత సీన్ లేదని నేను ఎప్పుడో చెప్పాను. కానీ, ఎవరూ నా మాట పట్టించుకోలేదు. శుభ్మన్ గిల్కు వరుసగా అవకాశాలు ఇచ్చినట్లు సూర్యకుమార్ యాదవ్కు ఇచ్చినా అతను గొప్ప టెస్ట్ ప్లేయర్ అయ్యేవాడు. సూర్యకు టెస్ట్ల్లో శుభారంభం దక్కలేదు. కానీ అతని బ్యాటింగ్లో టెక్నిక్, వినూత్నమైన షాట్స్ ఉన్నాయి. మరోవైపు టీమిండియా మేనేజ్మెంట్, సెలెక్టర్లు సూర్యపై వైట్బాల్ స్పెషలిస్ట్ అనే ముద్ర వేశారు.
సెలెక్టర్లు ప్రతిభ ఉన్న ఆటగాళ్లపై ఫోకస్ పెట్టాలి. దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రుతురాజ్ గైక్వాడ్ నిలకడగా రాణిస్తున్నాడు. టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నాడు. సాయి సుదర్శన్ భారత్- ఏ తరఫున కూడా రాణిస్తున్నాడు. కానీ సెలెక్టర్లు వీరిని పట్టించుకోవడం లేదు. ఇలాంటి యువ ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వకుండా శుభ్మన్ గిల్కే వరుసగా అవకాశాలిస్తున్నారు.'అని క్రిష్ శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.