వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ భారత జట్టులో అత్యంత దురదృష్టవంతుడని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. తరుచూ అతని బ్యాటింగ్ ఆర్డర్ను మారుస్తున్నారని, దాంతో సంజూ బ్యాటింగ్ రిథమ్తో పాటు ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందన్నాడు. శుభ్మన్ గిల్ గైర్హాజరీలో ఓపెనర్గా ఆడిన సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 10 ఇన్నింగ్స్ల్లో 3 శతకాలు సాధించాడు. గిల్ రాకతో మళ్లీ మిడిలార్డర్కు మారిన సంజూ శాంసన్.. ఒక్కో మ్యాచ్కు ఒక్కో స్థానంలో ఆడుతున్నాడు.
కొన్నిసార్లు నెంబర్ 3లో ఆడితే.. మరికొన్ని సార్లు నెంబర్5, నెంబర్ 8లో ఆడుతున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో తొలి టీ20లోనూ సంజూ శాంసన్ మిడిలార్డర్కే పరిమితమయ్యాడు. దాంతో అతని బ్యాటింగ్ ఆర్డర్పై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన క్రిష్ శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్ విషయంలో సంజూ శాంసన్తో టీమిండియా మేనేజ్మెంట్ మ్యూజికల్ చైర్ ఆడుతుందని విమర్శించాడు.

'టీమిండియాలో దురదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది సంజూ శాంసనే. ఓపెనర్గా అతను శతకాలు బాదాడు. కానీ ప్రస్తుతం అతన్ని మూడో స్థానం నుంచి 8వ స్థానం వరకు బ్యాటింగ్కు పంపిస్తున్నారు. అవకాశం ఉంటే అతన్ని 11వ స్థానంలో కూడా ఆడించేలా ఉన్నారు. సంజూ శాంసన్ వంటి వ్యక్తులకు ఇది నిజంగా బాధకు గురిచేస్తోంది. టాపార్డర్లో మెరుగ్గా రాణించిన తర్వాత కూడా అతనికి సరైన బ్యాటింగ్ పొజిషన్ లేదు. అతనికి ఎలాంటి ఆప్షన్ కూడా లేదు.
ఎక్కడ ఆడమంటే అక్కడ ఆడాల్సిన పరిస్థితి. మంచి విషయం ఏంటంటే ఆసియా కప్లో నెంబర్ 5లో కూడా అతను రాణించాడు. ఇది అతనికి శుభసూచకం. ఎందుకంటే ఇప్పడు సంజూ శాంసన్ టీ20 వరల్డ్ కప్ 2026కు ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్గా మారిపోయాడు. నెంబర్ 5లోనే కచ్చితంగా బ్యాటింగ్ చేస్తాడు.'అని క్రిష్ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.
ఓపెనర్గా 12 ఇన్నింగ్స్లు ఆడిన శాంసన్ 37.90 సగటు, 183.70 స్ట్రైక్రేట్తో 471 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మతో కలిసి అదిరిపోయే ఆరంభాలు అందించాడు. కానీ శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా జట్టులోకి తిరిగి రావడంతో సంజూ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసియా కప్ 2025లో మిడిలార్డర్లోనూ సంజూ శాంసన్ సత్తా చాటాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో మెరుగ్గా రాణించడంపై ఫోకస్ పెట్టాడు.