టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై మాజీ క్రికెటర్ క్రిష్ శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. తమకు నచ్చిన ఆటగాళ్లనే భారత జట్టులోకి తీసుకుంటున్నాడని ఆరోపించాడు. ముఖ్యంగా యువ పేసర్ హర్షిత్ రాణాను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయడాన్ని తప్పుబట్టాడు. మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్లను సెలెక్టర్లు గత శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటన కోసం ఎంపిక చేసిన వన్డే జట్టులో భారత సెలెక్టర్లు సంచలన మార్పులు చేశారు.
టీమిండియా వన్డే సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి శుభ్మన్ గిల్ను కెప్టెన్గా నియమించారు. వన్డే ప్రపంచకప్ 2027 నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కెప్టెన్సీ కోల్పోయినా ఆటగాడిగా రోహిత్ శర్మ జట్టులో చోటు దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీ కూడా రీఎంట్రీ ఇచ్చాడు. రవీంద్ర జడేజాపై వేటు వేసిన సెలెక్టర్లు నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించారు. సిరాజ్ వన్డే టీమ్లోకి రీఎంట్రీ ఇవ్వగా.. బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు.

టీ20లతో పాటు వన్డే ఫార్మాట్కు కూడా హర్షిత్ రాణాను సెలెక్టర్లు ఎంపిక చేయడం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది. కేకేఆర్ ప్లేయర్గా హర్షిత్ రాణా.. గంభీర్కు ప్రియ శిష్యుడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. టీ20ల్లో అదరగొడుతున్న అర్ష్దీప్ సింగ్ను కాదని, హర్షిత్ రాణాను ఎంపిక చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
జట్టు సెలెక్షన్పై మాట్లాడిన కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. హర్షిత్ రాణా.. గంభీర్ తాలుకా కావడంతోనే భారత జట్టులో చోటు దక్కించుకుంటున్నాడని ఆరోపించాడు. 'భారత జట్టులో హర్షిత్ రాణా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అతను శాశ్వత ప్లేయర్గా మారిపోయాడు. ఎందుకంటే అతను గౌతమ్ గంభీర్కు ప్రియమైన శిష్యుడు. అందుకే అతనికి గంభీర్ ప్రాధాన్యం ఇస్తున్నాడు. భారత జట్టులో కెప్టెన్ శుభ్మన్ గిల్ తర్వాత హర్షిత్ రాణా పేరే ఉంటుంది.'అని క్రిష్ శ్రీకాంత్ పేర్కొన్నాడు.
గాయంతో ఈ పర్యటనకు దూరమైన హార్దిక్ పాండ్యా స్థానంలో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని ఎంపిక చేయడాన్ని కూడా క్రిష్ శ్రీకాంత్ తప్పుబట్టాడు. హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయ ఆటగాడు రవీంద్ర జడేజా అని, నితీష్ను బ్యాటర్గా తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు.
శుభ్మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.
సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, వరుణ్ చక్రవర్తీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.