డొమినికా: వెస్టిండీస్ పర్యటనను టీమిండియా విజయంతో ప్రారంభించింది. రెండు టెస్ట్ల సిరీస్లో సమష్టి ప్రదర్శనతో శుభారంభం చేసింది. డొమినికా వేదికగా మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టీమిండియా సమష్టి ప్రదర్శనకు విండీస్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ధాటికి విండీస్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన విండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్వైట్.. బ్యాటింగ్ వైఫల్యమే ఘోర ఓటమికి కారణమైందన్నాడు. పిచ్ పూర్తిగా స్పిన్కు అనుకూలించడంతో వరల్డ్ బెస్ట్ స్పిన్నర్లు అయిన అశ్విన్, జడేజాలను ఎదుర్కోవడం కష్టమైందని చెప్పాడు.

'మ్యాచ్కు హాజరై మాకు మద్దతు తెలిపిన డొమినికా ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు. తొలి రోజు ఆటలో కాస్త మెరుగైన ప్రదర్శన చేశాం. కానీ దాన్ని అలానే కొనసాగించలేకపోయాం. పేలవ బ్యాటింగ్తో మూల్యం చెల్లించుకున్నాం. వికెట్ పూర్తిగా స్పిన్కు అనుకూలించింది. ముఖ్యంగా నా వైఫల్యం తీవ్ర నిరాశకు గురి చేసింది.
కెప్టెన్గా ముందుండి నడిపించాల్సిన నేను విఫలమవ్వడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. తొలి ఇన్నింగ్స్లో వరుసగా వికెట్లు కోల్పోయాం. ఓ సీనియర్ ఆటగాడిగా జట్టు ఇలా నడిపించడం సరికాదు. అశ్విన్, జడేజా బౌలింగ్ ఎదుర్కొవడం కష్టం. టీమిండియా ఫీల్డ్ సెటప్ కూడా అద్భుతంగా ఉంది.
డిఫెన్స్, బ్యాటింగ్ మధ్య మంచి సమతూకం ఉండాలి. ప్రణాళికలకు తగ్గట్లు మేం షాట్స్ ఆడలేకపోయాం. ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడం మేం నేర్చుకోవాలి. అరంగేట్ర ప్లేయర్ అథంజే అద్భుతంగా ఆడాడు. బంతితో పాటు బ్యాట్తోనూ ఆకట్టుకున్నాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంది. వెస్టిండీస్ క్రికెట్కు అతను గొప్ప సేవలందిస్తాడు.'అని క్రైగ్ బ్రాత్వైట్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ అశ్విన్(5/60) ధాటికి 150 పరుగులకే కుప్పకూలింది. అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్ 421/5 వద్ద డిక్లేర్ చేసింది. యశస్వి (387 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్తో 171), రోహిత్ శర్మ(103) సెంచరీలతో చెలరేగగా.. కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు.
దాంతో విండీస్ ముందు 272 పరుగుల భారీ లక్ష్యం నమోదవ్వగా.. ఆ జట్టు 150 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్(7/71) ఏడు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. జడేజా రెండు, సిరాజ్ ఓ వికెట్ తీసారు.