భారత టాప్ చెస్ ప్లేయర్, గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి చరిత్ర సృష్టించింది. ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ సెమీఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డుకెక్కింది. జార్జియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో ఈ తెలుగు అమ్మాయి 1.5-0.5 తేడాతో చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్పై విజయం సాధించింది. శనివారం తొలి గేమ్లో గెలిచిన హంపి.. ఆదివారం జరిగిన రెండో గేమ్ను డ్రాగా ముగించింది.
తొలి గేమ్లో తెల్లపావులతో ఆడిన కోనేరు హంపి.. యుక్సిన్ సాంగ్పై 53 ఎత్తుల్లో విజయం సాధించింది. ఈ గెలుపు తెలుగమ్మాయికి స్పష్టమైన ఆధిక్యాన్ని ఇచ్చింది. ఈ మ్యాచ్ ఓపెనింగ్లో లభించిన అడ్వాంటేజ్ను వాడుకొని హంపి విజయం సాధించింది.

రెండో గేమ్ను హంపి 53 ఎత్తుల్లో డ్రా చేసుకుంది. అప్పటికే ఒక పాయింట్తో ఆధిక్యంలో ఉండటంతో.. ఈ డ్రా ఆమెను సెమీఫైనల్కు చేర్చడానికి కలిసొచ్చింది. సమయ లోపం వల్ల కొన్ని తప్పులు చేసిన హంపి.. వ్యూహాత్మకమైన ఆటతో ముందంజ వేసింది. ఈ గెలుపుతో క్యాండిడేట్స్ టోర్నీ ఆడే అవకాశాలు కోనేరు హంపికి మెరుగుపడ్డాయి. ప్రపంచకప్లో టాప్-3లో నిలిచిన ఆటగాళ్లు.. ఈ ఏడాది చివర్లో జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధిస్తారు.
ఈ ప్రపంచకప్లో రౌండ్ 3లో పోలాండ్కు చెందిన క్లౌడియా కులోన్పై 0-5-1.5 తేడాతో విజయం సాధించిన కోనేరు హంపి..నాలుగో రౌండ్లో స్విట్జర్లాండ్ స్టార్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ను 2.5-1.5 తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ ఫలితాన్ని టై బ్రేక్ ద్వారా తేల్చాల్సి వచ్చింది.
సెమీఫైనల్లో టాప్ సీడ్ లీ టింజీ(చైనా)తో హంపి అమీతుమీ తేల్చుకోనుంది. టింజీ క్వార్టర్స్లో 2-0తో జార్జియా ప్లేయర్ ననా జాగ్నిజెను ఓడించింది. మరోవైపు ఇద్దరు భారత అమ్మాయిలు ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్ముఖ్ మధ్య క్వార్టర్స్ ఫలితం సోమవారం టై బ్రేక్స్లో తేలనుంది. ఈ ఇద్దరి మధ్య రెండో గేమ్ కూడా డ్రాగా ముగియడంతో ట్రై బ్రేక్స్ తప్పలేదు. వైశాలి టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వార్టర్స్లో ఆమె 0.5-1.5తో తాన్ జ్యోంగి చేతిలో ఓడింది. రెండో గేమ్లో వైశాలి ఓటమి చవిచూసింది. ఈ టోర్నీలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారిణులు మహిళల క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధిస్తారు.