మెల్బోర్న్: కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించినా ఆడేందుకు తాను సిద్దమని ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ స్పష్టం చేశాడు. ఇక ఈ సీజన్ ఐపీఎల్ వేలంలో కమిన్స్ను కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ.15.50 కోట్ల రికార్డు ధరకు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ రూపంలో ఈ ఆసీస్ పేసర్కు వచ్చిన అద్భుత అవకాశాన్ని కరోనా ఎత్తుకెళ్లే పరిస్థితి నెలకొంది.
ఇక మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ కరోనా కారణంగా ఏప్రిల్ 15కు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు ఈ క్యాష్ రిచ్ లీగ్ నిర్వహణపై సందేహం నెలకొంది. ఒక వేళ ఐపీఎల్ జరిగితే భారీ నష్టం సంభవించనుంది. దీంతోనే ప్రేక్షకుల్లేకుండానైనా ఐపీఎల్ నిర్వహించాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఇప్పటికే భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఈ ఐడియాకు ఒకే చెప్పగా.. తాజాగా కమిన్స్ కూడా సై అన్నాడు.
'తొలి ప్రాధాన్యత భద్రతకైతే.. రెండోది ప్రస్తుత పరిస్థితుల నుంచి సాధారణ స్థితికి చేరుకోవడం. దానికి కావాల్సిన మార్గాలను అన్వేషించాలి. ప్రస్తుత పరిస్థితిల్లో ప్రజలు మైదానాల్లోకి వచ్చే అవకాశం లేదు. కానీ ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లను నిర్వహించి ప్రత్యక్షప్రసారం చేస్తే ప్రజలు ఇంట్లోనే కూర్చొని టీవీల్లో చూస్తారు. అయితే క్రికెట్కు అత్యంత ఆదరణ కలిగిన భారత్లో ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో మ్యాచ్ ఆడటం వినూత్న అనుభూతిని కలిగించేదే.
సిక్సర్ కొట్టినా, వికెట్ తీసినా స్టేడియంలో అభిమానులు చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఒకవేళ అంతా సవ్యంగా సాగి ప్రేక్షకులు లేకుండా మ్యాచ్లు సాగే అవకాశం ఉంటే ఐపీఎల్ ఆడటానికి నేను సిద్దం'అని కమ్మిన్స్ ఓ మీడియా చానెల్తో చెప్పుకొచ్చాడు. 2019 ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా కమిన్స్ నిలిచాడు. ఈ సీజన్లో 12 మ్యాచ్లు ఆడిన ఈ ఆసీస్ పేసర్.. 59 వికెట్లు పడగొట్టాడు.