రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజయోత్సవ వేడుక విషాదంగా ముగిసిన విషయం తెలిసిందే. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత టైటిల్ గెలిచిన ఆర్సీబీ.. బెంగళూరు వేదికగా విజయోత్సవ వేడుకలను ఏర్పాటు చేసింది. అయితే చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా.. 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన అనంతరం ఆర్సీబీ ఫ్రాంచైజీతో పాటు విరాట్ కోహ్లీ మౌనంగా ఉండిపోయారు. రెండు నెలల తర్వాత ఆర్సీబీ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేసింది. ఆర్సీబీ కేర్స్ ద్వారా అభిమానులకు అండగా ఉంటామని ప్రకటించింది. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది.

'జూన్ 4, 2025న మా గుండె పగిలింది. ఆ రోజు ఆర్సీబీ కుటుంబంలోని 11 మంది సభ్యులను మేము కోల్పోయాం. వారంతా మాలో భాగమే. ఆర్సీబీని ప్రత్యేకంగా తీర్చిదిద్దడంలో వారిది కీలక పాత్ర. వారు లేని లోటు పూడ్చలేనిది. ప్రతీ ఒక్కరిలోనూ వారి జ్ఞాపకాలను చూసుకుంటాము. మా తొలి అడుగుగా వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు నష్టపరిహారంగా ఇచ్చాం. కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా భవిష్యత్తులో వారికి అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటాం. అందుకోసం ఆర్సీబీ కేర్ పని చేస్తుంది.'అని ఆర్సీబీ ఫ్రాంచైజీ ఓ ప్రకటనను విడుదల చేసింది.
తొక్కిసలాట ఘటన అనంతరం ఇంగ్లండ్ వెళ్లిపోయిన కోహ్లీ..తాజాగా విచారం వ్యక్తం చేశాడు. 'జూన్ 4న హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. మా ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత సంతోషకరమైన క్షణం విషాదంగా మారింది.
ప్రాణాలు కోల్పోయిన అభిమానుల కుటుంబాల కోసం, గాయపడిన వారికి కోసం తీవ్రంగా ఆలోచిస్తున్నాం.
వారి కోసం ప్రార్థిస్తున్నాం. మీకు కలిగిన నష్టం మాలో భాగం. ఇక నుంచి జాగ్రత్తగా.. గౌరవంగా, మరింత బాధ్యతతో కలిసికట్టుగా ముందుకు సాగుదాం.'అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలను ఆర్సీబీ షేర్ చేసింది.