లక్నో: ఐపీఎల్ 2023 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య జరిగిన గొడవ తీవ్ర చర్చనీయాంశమైంది. ఇద్దరి ఆటగాళ్లది తప్పేనని తేల్చిన బీసీసీఐ మ్యాచ్ ఫీజులో పూర్తి మొత్తాన్ని కోత విధించింది. ఈ గొడవ కారణంగా విరాట్ కోహ్లీ రూ. కోటీ రూపాయల వరకు నష్టపోగా.. గంభీర్ రూ.25 లక్షలు కోల్పోయాడు.
అయితే.. ఈ గొడవ ఎందుకు? ఎక్కడ మొదలైందన్న విషయంపై స్పష్టత లేదు. సోషల్ మీడియాలో మాత్రం అనేక వాదనలు వినిపిస్తున్నాయి. మహమ్మద్ సిరాజ్ కారణంగానే గొడవ జరిగిందని ఒకరంటే.. కోహ్లీ అతి చేయడం వల్లే జరిగిందని మరికొందరు అంటున్నారు. మైదానంలో గొడవ కన్నా ముందే లక్నో సూపర్ జెయింట్స్ ఆర్సీబీని కవ్వించింది. ఈ విషయం చాలా మందికి తెలియదు.

ఏప్రిల్ 10న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 212 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక ఒక్క పరుగుతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్కు ఆర్సీబీ అభిమానులు భారీ స్థాయిలో హాజరై.. తమ అభిమాన జట్టుకు మద్దతు తెలిపారు. స్టేడియంలో లక్నో ఫ్యాన్సే కనిపించలేదు. అంతలా ఆర్సీబీ అభిమానులు రచ్చ చేశారు.
ఆర్సీబీ అభిమానుల అరుపులతో చికాకుకు గురైన లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్.. విజయానంతరం గమ్మున ఉండాలని నోటీపై వేలుతో సైగలు చేశాడు. ఈ ఫొటోలు తెగ వైరల్ అవ్వగా.. ఆర్సీబీ అభిమానులు తీవ్రంగా బాధపడ్డాడు. మే 1న జరిగే తదుపరి మ్యాచ్లో తమ జట్టు సత్తా ఏంటో చూపిస్తామని సోషల్ మీడియా వేదికగానే సవాల్ విసిరారు. లక్నో సూపర్ జెయింట్స్ అడ్మిన్ కూడా ట్విటర్ వేదికగా ప్లే బోల్డ్ అంటే ఇదేనా? అని ఆర్సీబీని ఎగతాళి చేస్తూ ట్వీట్ చేశాడు.

విజయానందంలో విర్రవీగుతున్న లక్నో సూపర్ జెయింట్స్ పల్లెత్తు మాట కూడా అనని ఆర్సీబీ.. అన్ని మనసులో పెట్టుకొని రెండో మ్యాచ్లో తమ ఆటతో బదులిచ్చింది. ఈ క్రమంలో లక్నో బ్యాటింగ్ సందర్భంగా వికెట్ కోల్పోయినప్పుడల్లా కోహ్లీ... ప్రేక్షకుల వైపు చూస్తూ... ఆర్సీబీ అభిమానులు సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదని, తాను అండగా ఉంటానని, గట్టిగా అరవాలని సైగలు చేశాడు. గంభీర్ చర్యలకు ప్రతీకారం తీర్చుకున్నాడు.
విజయానంతరం ఆర్సీబీ అడ్మిన్.. లక్నో ప్లే బోల్డ్ ట్వీట్కు బదులిచ్చాడు. ప్లే బోల్డ్ అంటే ఇదని, తెలుసొచ్చిందా? అని కౌంటరిచ్చాడు. దీనికి లక్నో అడ్మిన్ స్పందిస్తూ..1-1తో సమమైందని, ఈ రోజు మీది.. ఎంజాయ్ చేయండి. మళ్లీ కలుద్దామని బదులిచ్చింది. దీనికి వెంటనే ఆర్సీబీ 1-1 కాదు..3-1తో మాదే పై చేయి'అని బదులిచ్చింది. విజయానంతరం డ్రెస్సింగ్ రూమ్లో దినేశ్ కార్తీక్ కూడా లక్నో సూపర్ జెయింట్స్ ప్లే బోల్డ్ ట్వీట్పై బదులిచ్చాడు.
'మీరు ఇచ్చినప్పుడు.. తీసుకోవడానికి సిద్దంగా ఉండాలి. అలా లేనప్పుడు ఇవ్వకూడదు'అని గొడవను ఉద్దేశించిన కోహ్లీ వ్యాఖ్యానించాడు.