లక్నో: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మధ్య జరిగిన మ్యాచ్ కంటే.. ఈ పోరు సందర్భంగా చోటు చేసుకున్న గొడవలపైనే ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. మ్యాచ్ ముగిసిన అనంతరం లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ఇద్దరూ స్టార్ ఆటగాళ్లు ఒకరిపై ఒకరూ దూసుకెళ్లగా సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకొని పక్కకు జరపించడం హాట్ టాపిక్ అయ్యింది. ఐపీఎల్ 2013లో కోహ్లీ-గంభీర్ మధ్య తొలిసారి గొడవ జరగ్గా.. అప్పటి నుంచి ఈ ఇద్దరూ ఉప్పు-నిప్పుగానే ఉంటున్నారు. కోహ్లీ పెద్దగా పట్టించుకోకపోయినా.. గంభీర్ మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పించాడు. టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించేవరకు తన నోటికి పనిచెప్పాడు.

గతేడాదిగా కోహ్లీ విషయంలో గంభీర్ సైలెంట్ అయ్యాడు. కానీ ఆర్సీబీ అభిమానులను ఉద్దేశించి అతను చేసిన సైగలను సీరియస్గా తీసుకున్న కోహ్లీ తనదైన శైలిలో బదులిచ్చాడు. దాంతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య భావోద్వేగాలు తారా స్థాయికి చేరి గొడవకు దారి తీసింది. నవీన్ ఉల్ హక్ పట్ల కోహ్లీ దురుసుగా ప్రవర్తించడం.. కోహ్లీ తీరును గంభీర్ తప్పుబట్టడంతో గొడవ పెద్దది అయ్యింది.
ఈ ఘటనలో ముగ్గురిని తప్పుబట్టిన బీసీసీఐ.. భారీ జరిమానా విధించింది. విరాట్ కోహ్లీతో పాటు గౌతమ్ గంభీర్ మ్యాచ్ ఫీజులో పూర్తి స్థాయి కోత విధించడంతో పాటు నవీన్ ఉల్ హక్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తూ జరిమానా వేసింది. ఈ లెక్కన చూసుకుంటే విరాట్ కోహ్లీ రూ.1.07 కోట్లు జరిమానా విధించనుండగా... మెంటార్ గౌతమ్ గంభీర్ రూ.25 లక్షలు, నవీన్ ఉల్ హక్ రూ.1.79 లక్షలు జరిమానా చెల్లించనున్నారు.
అయితే బీసీసీఐ చెబుతున్నట్లు ఆటగాళ్లు ఎవరూ కూడా ఈ డబ్బులు చెల్లించరనేది చాలా మందికి తెలియని విషయం. ఇదే కాదు స్లో ఓవర్ రేట్ కారణంగా విధించే జరిమానాలను కూడా ఫ్రాంచైజీలే భరిస్తాయి. ఆటగాళ్లు రూపాయి కూడా జరిమానాగా విధించరు. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఈ విషయాన్ని తాజాగా పీటీఐ జర్నలిస్ట్ కుషాన్ సర్కార్ తన ట్విటర్ వేదికగా వెల్లడించాడు.