సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. రాయ్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 102), యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్(83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 105) సెంచరీలతో చెలరేగారు. దాంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 358 పరుగుల భారీ స్కోర్ చేసింది.
కెప్టెన్ కేఎల్ రాహుల్(43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 66 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్(2/63) రెండు వికెట్లు తీయగా.. నండ్రే బర్గర్(1/43), లుంగి ఎంగిడి(1/51) చెరో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(22), రోహిత్ శర్మ(14) తీవ్రంగా నిరాశపర్చారు. అయితే సౌతాఫ్రికా బౌలర్ల పేలవ బౌలింగ్ కారణంగా తొలి రెండు ఓవర్లలోనే భారత్కు 10 పరుగులు అప్పనంగా లభించాయి. రోహిత్ శర్మను బర్గర్ ఔట్ చేయడంతో తొలి వికెట్కు నమోదైన 40 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే యశస్వి జైస్వాల్ను మార్కో యాన్సెన్ ఔట్ చేశాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ జట్టును ఆదుకున్నారు. క్రీజులో సెట్ అయ్యేందుకు ఈ ఇద్దరూ కాస్త సమయం తీసుకోవడంతో పవర్ ప్లేలో భారత్ 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది.
అనంతరం సమయోచితంగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీ.. సౌతాఫ్రికా బౌలర్లను చెడుగుడు ఆడింది. క్విక్ సింగిల్స్, డబుల్స్తో పాటు బౌండరీలతో వేగంగా పరుగులురాబట్టింది. ఈ క్రమంలో 52 బంతుల్లో రుతురాజ్ గైక్వాడ్.. 47 బంతుల్లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అనంతరం మరింత దూకుడగా ఆడిన ఈ జోడీ భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడింది. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ బౌండరీల మోత మోగించాడు. 77 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న రుతురాజ్ కెరీర్లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో మార్కో యాన్సెన్ బౌలింగ్లో రుతురాజ్(105) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 195 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి కేఎల్ రాహుల్ రాగా.. విరాట్ కోహ్లీ తనదైన శైలిలో 90 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. కెరీర్లో 84వ శతకం.. 53వ వన్డే సెంచరీ సాధించాడు. ఆ వెంటనే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఎంగిడి బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. వాషింగ్టన్ సుందర్(1) విఫలమైనా.. రవీంద్ర జడేజా(24 నాటౌట్)తో కలిసి రాహుల్ దూకుడుగా ఆడాడు. 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన కేఎల్ రాహుల్ జట్టుకు 358 పరుగుల భారీ స్కోర్ అందించాడు.