హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులు మరోసారి రెండుగా ఛీలిపోయారు. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఈ ఇద్దరూ భారత ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ(15)ను ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలి వికెట్గా పెవిలియన్ చేర్చగా.. విరాట్ కోహ్లీని మిచెల్ స్టార్క్ నాలుగో వికెట్గా ఔట్ చేశాడు.
రోహిత్ శర్మ ఔటైన వెంటనే కొందరు అభిమానులు అతనిపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్కు దిగారు. వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాలని, కీలక మ్యాచ్ల్లో ఒక్కసారి కూడా ఆడింది లేదని విమర్శించారు. గణంకాలతో సహా ట్వీట్ చేశారు.

విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ ఐసీసీ టైటిల్ గెలవకపోవడానికి ప్రధాన కారణం రోహిత్ శర్మనేనని, 2017 డబ్ల్యూటీసీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి ఓపెనర్గా రోహిత్ శర్మ వైఫల్యమే కారణమని గుర్తు చేశారు.
ఇక విరాట్ కోహ్లీ ఔటైన వెంటనే రోహిత్ శర్మ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. చోక్లీ అంటూ అతనిపై విమర్శలు గుప్పించారు. రోహిత్ కంటే కోహ్లీనే ఫ్రాడ్ అని, కీలక మ్యాచ్ల్లో అతను విఫలమయ్యాడని, లైఫ్ లభిస్తేనే ఆడుతాడని, అఫ్గానిస్థాన్ వంటి చిన్న దేశాలపై మాత్రమే సెంచరీలు చేస్తాడని మండిపడ్డారు. రోహిత్ శర్మను విమర్శించే ముందు కోహ్లీ గణంకాలు పరిశీలించాలని ట్రోల్ చేశారు. ఐపీఎల్లో తప్పా కోహ్లీ ఎక్కడా ఆడాడని విమర్శలు గుప్పించారు.
తటస్థ అభిమానులు మాత్రం ఈ ట్రోలింగ్ను తప్పుబడుతున్నారు. మన స్టార్ ఆటగాళ్లను మనమే తిట్టుకోవడం ఏంటని మండిపడుతున్నారు. ఇది ఏ మాత్రం భావ్యం కాదని సూచిస్తున్నారు.
భారీ స్కోర్ను అధిగమించే లక్ష్యంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ(15), శుభ్మన్ గిల్లను త్వరగా పెవిలియన్ చేర్చిన ఆసీస్.. ఆ తర్వాత పుజారా(14), విరాట్ కోహ్లీ(14)లను కూడా ఔట్ చేసి మ్యాచ్పై పట్టు బిగించింది. నలుగురు బౌలర్లు తలో వికెట్ తీయడంతో భారత్ 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
అంతకుముందు 327/3 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు తమ తొలి ఇన్నింగ్స్ ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా 469 పరుగులకు కుప్పకూలింది. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్(4/108) నాలుగు వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ ఆట సెషన్నరలోనే ముగిసింది.
ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్తో 163), స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121) సెంచరీలతో చెలరేగగా.. అలెక్స్ క్యారీ(69 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 48), డేవిడ్ వార్నర్(60 బంతుల్లో 8 ఫోర్లతో 43) విలువైన పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్కు తోడుగా మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీసారు. జడేజాకు ఓ వికెట్ దక్కింది.