వెస్టిండీస్తో తొలి టెస్ట్ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా గురువారం అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్లో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ముందుగా బౌలింగ్లో ప్రత్యర్థిని తక్కువ స్కోర్కే పరిమితం చేసిన శుభ్మన్ గిల్ సేన.. ఆ తర్వాత బ్యాటింగ్లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది.
ఓపెనర్ కేఎల్ రాహుల్(114 బంతుల్లో 6 ఫోర్లతో 53 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 38 ఓవర్లలో 2 వికెట్లకు 121 పరుగులు చేసింది. రాహుల్తో పాటు కెప్టెన్ గిల్(18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్(54 బంతుల్లో 7 ఫోర్లతో 36) హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. సాయి సుదర్శన్(7) మరోసారి నిరాశపర్చాడు. వెస్టిండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్, రోస్టన్ ఛేజ్ చెరో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 44.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. జస్టిన్ గ్రీవ్స్(48 బంతుల్లో 4 ఫోర్లతో 32), షైహోప్(36 బంతుల్లో 3 ఫోర్లతో 26), రోస్టన్ ఛేజ్(43 బంతుల్లో 4 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్కు ఒక వికెట్ దక్కింది. భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ ఇన్నింగ్స్ రెండు సెషన్లలోనే ముగిసింది. ప్రస్తుతం భారత్ 41 పరుగుల వెనుకంజలో ఉంది.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ తేజ్నారాయణ్ చందర్పాల్(0)ను సిరాజ్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే జాన్ కాంప్బెల్(8)ను జస్ప్రీత్ బుమ్రా కీపర్ క్యాచ్గా ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన బ్రాండన్ కింగ్(13)ను స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్.. ఆచితూచి ఆడిన అలిక్ అథనాసియస్(12)ను క్యాచ్ ఔట్గా వెనక్కిపంపాడు. దాంతో వెస్టిండీస్ 42 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రోస్టన్ ఛేజ్(22 బ్యాంటింగ్) షైహోప్(26) ఆచితూచి ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 48 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని విడదీసేందుకు కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పిన్నర్లను రంగంలోకి దించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న కుల్దీప్ యాదవ్ తన రెండో ఓవర్లోనే షైహోప్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ వికెట్ అనంతరం అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించడంతో వెస్టిండీస్ 90/5 స్కోర్తో తొలి సెషన్ను ముగించింది.
రెండో సెషన్లోనూ సిరాజ్ తన జోరును కొనసాగించాడు. క్రీజులో సెట్ అయిన కెప్టెన్ రోస్టన్ ఛేజ్ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. జిడ్డుగా బ్యాటింగ్ చేసిన ఖారీ పిర్(11)ను వాషింగ్టన్ సుందర్ ఔట్చేయగా.. హాఫ్ సెంచరీ దిశగా సాగిన జస్టిన్ గ్రీవ్స్ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. తన మరుసటి ఓవర్లో జోహన్ లేన్(1) కూడా బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయగా.. జోమెల్ వార్నికన్(8)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేసి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్కు తెరదించాడు. దాంతో రెండో సెషన్ కూడా ముగిసింది.
ఆఖరి సెషన్లో భారత్ బ్యాటింగ్కు దిగగా.. ఓపెనర్లు ఆచితూచి ఆడారు. 23/0 స్కోర్ వద్ద ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. ఆట తిరిగి ప్రారంభమైన అనంతరం భారత ఓపెనర్లు వేగంగా పరుగులు రాబట్టారు. జైడెన్ సీల్స్ బౌలింగ్లో యశస్వి జైస్వాల్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే సాయిసుదర్శన్(7) రోస్టన్ చేజ్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన శుభ్మన్ గిల్తో కలిసి రాహుల్ మార్క్ బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ క్రమంలో అతను 101 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.