
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన పడిన టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వెస్టిండీస్ పర్యటన మొత్తానికి దూరం కానున్నాడు. ఇటీవలే హెర్నియా ఆపరేషన్ చేసుకున్న రాహుల్.. వెస్టిండీస్తో టీ20 సిరీస్కు ఎంపికయ్యాడు. ఈ పర్యటనకు ముందు ఫిట్నెస్ నిరూపించుకునేందుకు బెంగళూరులోని ఎన్సీఏకు వచ్చాడు. కానీ అక్కడ దురదృష్టవశాత్తు అతను కరోనా వైరస్ బారినపడ్డాడు.
దాంతో రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్లతో కలసి కేఎల్ రాహుల్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లలేకపోయాడు. అయితే తొలి మూడు టీ20ల అనంతరం కేఎల్ రాహుల్ అందుబాటులోకి వస్తాడని ప్రచారం జరిగింది. కానీ అతను విండీస్ పర్యటన వెళ్లే సూచనలు కనబడటం లేదని ఓ బీసీసీఐ అధికారి టైమ్స్ ఇండియాకు తెలిపాడు.
అంతేకాకుండా రాహుల్ స్థానంలో రిప్లేస్మెంట్గా ఎవరిని ఎంపిక చేయలేదన్నాడు. 'కరోనా నుంచి పూర్తిగా కోలుకునేందుకు రాహుల్కు తగినంత విశ్రాంతి అవసరం. అతనికి ప్రత్యామ్నాయ ఆటగాడిని కూడా ఎంపిక చేయలేదు. రిషభ్ పంత్ లేదా ఇషాన్ కిషన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. మరో ఆటగాడిని అక్కడికి పంపించే అవకాశం అయితే లేదు'అని సదరు అధికారి పేర్కొన్నాడు. అయితే వన్డే సిరీస్లో అదరగొట్టిన శుభ్మన్ గిల్ను రాహుల్ ప్రత్యామ్నాయంగా ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినా.. సెలెక్టర్లు ఆ దిశగా ఆలోచించడం లేదు. అయితే ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
శిఖర్ ధావన్ సారథ్యంలో టీమిండియా.. విండీస్ గడ్డపై వరుస విజయాలతో సిరీస్ కైవసం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్లో చివరి మ్యాచ్ నేడు(గురువారం) జరగనుండగా.. జూలై 29 నుంచి 5 టీ20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లో భారత జట్టును రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ నడిపించనున్నాడు. ఇక ఈ పర్యటనకు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమైన విషయం తెలిసిందే.