న్యూఢిల్లీ: భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఆసియా కప్కు కూడా దూరం కానున్నారు. గాయాలతో జట్టుకు దూరమైన ఈ ఇద్దరూ నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు.
అయితే పూర్తి ఫిట్నెస్ సాధించలేదని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే రిస్క్ తీసుకోవద్దని భావించిన బోర్డు ఈ ఇద్దరినీ ఆసియాకప్ 2023 టోర్నీకి దూరంగా ఉంచాలని భావిస్తున్నట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

వన్డే ప్రపంచకప్ ముందు భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్తో కేఎల్ రాహుల్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా జరిగే వరల్డ్ కప్ టీమ్ ప్రణాళికల్లో ఉన్న ఈ ఇద్దరూ.. గాయాలతో జట్టుకు దూరమయ్యారు.
వెన్నుగాయంతో ఈ ఏడాది మార్చి నుంచి శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరంగా ఉంటే.. ఐపీఎల్లో తొడకండరాల గాయానికి గురైన కేఎల్ రాహుల్ మే నెల నుంచి ఆటకు దూరమయ్యాడు. ఈ ఇద్దరూ గాయాల నుంచి కోలుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది. కానీ రీఎంట్రీ ఎప్పుడనే విషయాన్ని వెల్లడించలేదు.
'కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఇంకా వన్డే ఫార్మాట్ క్రికెట్కు కావాల్సిన పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. ఉక్కపోత వాతావారణం ఉండే శ్రీలంకలో పూర్తి ఫిట్నెస్ లేకుండా ఆడటం కష్టం. బీసీసీఐ మెడికల్ మాత్రం కేఎల్ రాహుల్.. ఆస్ట్రేలియాతో సిరీస్కు అందుబాటులోకి వస్తాడని భావిస్తోంది.'అని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నాడు.
శ్రేయస్ అయ్యర్ వన్డే ప్రపంచకప్కు కూడా దూరమవుతాడని సదరు అధికారి తెలిపాడు. 'శ్రేయస్ అయ్యర్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రారంభించాడు. కానీ వరల్డ్ కప్ ఆడటం సందేహమే. టీమిండియా మేనేజ్మెంట్ 100 శాతం ఫిట్నెస్ కోరుకుంటోంది. వన్డే ఫార్మాట్ కంటే టీ20 సిరీస్లతోనే అతని రీఎంట్రీ సులువని భావిస్తోంది. అయ్యర్తో పాటు కేఎల్ రాహుల్ ఫిటెనెస్ను నిశితంగా పరిశీలిస్తున్నారు.'అని తెలిపాడు.