మొహాలీ: సమష్టి ప్రదర్శనతోనే ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో శుభారంభం చేసామని టీమిండియా తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. బౌలింగ్లో మహమ్మద్ షమీ సత్తా చాటితే.. బ్యాటింగ్లో శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్తో పాటు సూర్య అద్భుత ప్రదర్శన కనబర్చారని కొనియాడాడు. మొహాలీ వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రాహుల్.. కెప్టెన్గా తనకు ఇదే తొలి విజయం కాదని తెలిపాడు. గతంలోనూ సారథిగా మ్యాచ్లు గెలిపించానని, అలవాటుగా మార్చుకున్నానని తెలిపాడు. కెప్టెన్సీ తనకు చాలా ఇష్టమని చెప్పాడు. 'మధ్యాహ్నం మా ఉద్దేశం బాగుంది. కోలంబోలో ఆడి వచ్చిన అనుభవంతో ఈ మ్యాచ్ ప్రారంభంలో మైదాన పరిస్థితులు స్వర్గాన్ని తలపించాయి. కానీ తర్వాత ఇక్కడ కూడా అంతకుమించిన ఉక్కపోత, వేడి ఉందని కాసేపటికే అర్థమైంది.

ఈ కఠిన పరిస్థితుల్లో ఆడటం భౌతికంగా మాకు గట్టి సవాల్గా మారింది. కానీ మేమంతా ఇప్పటికే ఫిట్నెస్పై వర్క్ చేయడం మైదానంలో సహాయపడింది. మేం కేవలం ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగాం. ప్రతీ ఒక్కరు 10 ఓవర్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాటింగ్లో శుభ్మన్ గిల్ ఔటైన తర్వాత క్లిష్ట పరిస్థితులు కనిపించాయి.
సెట్ బ్యాటర్ ఔటవ్వడంతో ఇన్నింగ్స్ నిలబెట్టడం కష్టమనిపించింది. కానీ సూర్యకుమార్ యాదవ్తో కలిసి తాను కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో జట్టు విజయానికి దోహదపడింది. సూర్య, నేను తరుచూ మాట్లాడుకున్నాం. ఎలాంటి షాట్స్ ఆడాలనేదానిపై డిస్కస్ చేసుకున్నాం. రోటేటింగ్ చేయడం మా బ్యాటర్లకు కలిసొచ్చింది. తొందరపాటు లేకుండా నిదానంగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. ఈ క్రమంలోనే మ్యాచ్ను వీలైనంత డీప్ తీసుకెళ్లాలనుకున్నాం.'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకు కుప్పకూలింది. డేవిడ్ వార్నర్(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. జోష్ ఇంగ్లీస్(45), స్టీవ్ స్మిత్(41), మార్నస్ లబుషేన్(39) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ ఐదు వికెట్లకు తోడుగా.. జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా.. 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. భారత ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (77 బంతుల్లో 10 ఫోర్లతో 71), శుభ్మన్ గిల్(63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 74)తో పాటు కేఎల్ రాహుల్(63 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 58 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా రెండు వికెట్లు తీయగా.., పాట్ కమిన్స్, సీన్ అబాట్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది.