ఇండోర్: లైట్స్ కింద ఫీల్డింగ్ చేయడం సవాల్తో కూడుకున్న పనని టీమిండియా తాత్కలిక సారథి కేఎల్ రాహుల్ అన్నాడు. ఈ కారణం చేతనే ఆసీస్తో రెండో వన్డేలో తమ ఆటగాళ్లు సునాయస క్యాచ్లు నేలపాలు చేశారని తెలిపాడు. ఇందులో కోచ్ల తప్పేం లేదని, వాళ్లు ఆటగాళ్లను అన్ని రకాలుగా సిద్దం చేశారని స్పష్టం చేశాడు.
ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా డక్ వర్త్ లూయిస్ ప్రకారం 99 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రాహుల్.. పిచ్ స్పిన్కు అనుకూలిస్తుందని ఊహించలేదన్నాడు.

'ఉదయం పిచ్ చూసినప్పుడు స్పిన్కు ఇంతలా సహకరిస్తుందని ఊహించలేదు. 400 పరుగుల లక్ష్యం టీమ్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. తుది జట్టు ఎంపిక అనేది మా చేతుల్లో లేనిది. మా బాధ్యత ఏంటి అనేదానిపై క్లారిటీ ఉంది. అవకాశం వచ్చిన ప్రతీ ప్లేయర్ వారి బాధ్యతపై ఫోకస్ పెట్టాలి. ఎప్పటికప్పుడూ ఆటను మెరుగుపరుచుకుంటూనే అవకాశాల కోసం ఎదురు చూడాలి.
ఈ మ్యాచ్లో మేం కొన్ని సునాయస క్యాచ్లు నేలపాలు చేశాం. కానీ లైట్స్ కింద ఫీల్డింగ్ చేయడం ఆశామాషి వ్యవహారం కాదు. కోచ్లంతా మేం ఫిట్గా ఉండేలా కష్టపడ్డారు. కొన్నిసార్లు ఈ తరహా తప్పిదాలు జరుగుతుంటాయి. ప్రతీ మ్యాచ్ నుంచి ఏదో ఒక గుణపాఠం నేర్చుకుంటున్నాం. తదుపరి మ్యాచ్లో మరింత మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాం.
మరో రెండు వారాల్లో ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మా ప్రధాన ఆటగాళ్లంతా జట్టులోకి రానున్నారు. మైదానంలో అడుగుపెట్టేందుకు వాళ్లంతా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు.'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్మన్ గిల్(97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 104), శ్రేయస్ అయ్యర్(90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లతో 105) సెంచరీలతో చెలరేగారు. సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 72 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ రాహుల్(38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2 వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ తీసారు. భారత బ్యాటర్ల ధాటికి ఆసీస్ బౌలర్లు పోటాపడి పరుగులు సమర్పించుకున్నారు. గ్రీన్ అయితే 103 పరుగులు ఇచ్చుకున్నాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలో 217 పరుగులకు కుప్పకూలింది. డేవిడ్ వార్నర్(39 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 53), సీన్ అబాట్(36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీకి ఓ వికెట్ దక్కింది.
400 పరుగుల భారీ లక్ష్యచేదనకు దిగిన ఆసీస్ ఇన్నింగ్స్కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఆటను కుదించారు. డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఆసీస్కు 33 ఓవర్లలో 317 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ విజయంతో మరో మ్యాచ్తో సంబంధం లేకుండానే 2-0తో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరగనుంది.