IND vs SA: సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో శుభారంభం చేయడంపై టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ సంతోషం వ్యక్తం చేశాడు. భారత పేసర్ల అసాధారణ ప్రదర్శనతోనే ఈ విజయం సాధించామని తెలిపాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన భారత్ 8 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది.
ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్.. కుర్రాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. తాము అనుకున్నదానికి పూర్తి భిన్నంగా ఈ మ్యాచ్ సాగిందన్నాడు.

'ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చింది. కుర్రాళ్లతో విజయాన్నందుకోవడం గొప్పగా ఉంది. అయితే మేం అనుకున్నది ఒకటయితే మరొకటి జరిగింది.
స్పిన్నర్లతో సౌతాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేయాలనేది మా ప్రణాళిక. కానీ మా పేసర్లు దుమ్మురేపారు. క్రమశిక్షణగా బౌలింగ్ చేశారు. బంతి కాస్త తిరిగింది.
చాలా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో ఏదో ఒక ఫార్మాట్కు ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతానికి టెస్ట్లు, టీ20లకే ఆదరణ ఉంది. దేశం కోసం ప్రతీ ఒక్క అద్భుతంగా ఆడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ అనుభవం పొందేందుకు కుర్రాళ్లకు ఇది మంచి అవకాశం.'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(5/37), ఆవేశ్ ఖాన్ (4/27) సఫారీ పతనాన్ని శాసించారు. ఫారీ బ్యాటర్లలో ఆండిలే పెహ్లుక్వాయో(49 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 33), టోనీ డీ జోర్జీ(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 28) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 16.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 117 పరుగులు చేసి 200 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. రుతురాజ్ గైక్వాడ్(5) విఫలమైనా.. అరంగేట్ర ప్లేయర్ సాయి సుదర్శన్(43 బంతుల్లో 9 ఫోర్లతో 55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(45 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు.
సౌతాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్దర్, ఆండిలో పెహ్లుక్వాయో తలో వికెట్ తీసారు.