ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ప్రాతినిథ్యం వహించాలనేది తన కలని టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్ మొదలైనప్పుడు తన ఆలోచన ఇలానే ఉండేదని, అందుకు తగ్గట్లుగా ఆర్సీబీ తనకు అవకాశాలు ఇచ్చిందని రాహుల్ గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు.
ఐపీఎల్ 2013 సీజన్లో ఈ క్యాష్ రిచ్ లీగ్లోకి అడుగుపెట్టిన కేఎల్ రాహుల్.. ఆర్సీబీ తరఫునే తొలి అవకాశాన్ని అందుకున్నాడు. ఆ సీజన్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అతను మరుసటి ఏడాదే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.

ఓపెనర్గా.. వికెట్ కీపర్గా సేవలందిస్తూ జట్టు వైస్ కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. మధ్యలో ఒడిదొడుకులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. తాజాగా సౌతాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్లో భారత జట్టుకు సారథ్యం వహించాడు. కోహ్లీ తర్వాత సఫారీ గడ్డపై వన్డే సిరీస్ గెలిచిన భారత కెప్టెన్గా చరిత్రకెక్కాడు.
'నేను యువకుడిగా ఉన్న సమయంలో నా ప్రతిభను నిరూపించుకునేందుకు ఆర్సీబీ నాకు ఛాన్స్ ఇచ్చింది. బెంగళూరుకు చెందిన నాకు ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచే ఆర్సీబీకి ఆడాలనే కోరిక ఉండేది. అందుకు తగ్గట్లుగానే కొన్నేళ్లపాటు ఆ జట్టుకు ఆడే అవకాశం లభించింది. ఆర్సీబీ ఎల్లప్పుడూ నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉంటుంది'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.