
మెల్బోర్న్: ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్దాంతరంగా తప్పుకోవడం చాలా బాధగా ఉందని టీమిండియా యువ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. గత శనివారం ప్రాక్టీస్ చేస్తూ రాహుల్ గాయపడిన విషయం తెలిసిందే. దాంతో మరో రెండు టెస్ట్లు మిగిలుండగానే స్వదేశం పయనమయ్యాడు. ఈ క్రమంలో టెస్ట్ సిరీస్ మధ్యలో జట్టును వీడిరావడం బాధగా ఉందని ట్వీట్ చేశాడు. ఆసీస్తో మూడో టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్న భారత జట్టుకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాడు. 'జట్టును వీడటం బాధగా ఉంది. మిగిలిన రెండు టెస్ట్ల్లో మా ఆటగాళ్లు ఆశించిన ఫలితాలు అందుకోవాలి. 'అని ట్వీట్లో పేర్కొన్నాడు.
ఇక రాహుల్ శనివారం ప్రాక్టీస్ చేస్తుండగా.. అతని ఎడమచేతి మణికట్టుకు గాయమైంది. గాయం తీవ్రత కారణంగా ఈ కర్ణాటక బ్యాట్స్మెన్ స్వదేశం పయనమయ్యాడు.
ఇక రాహుల్ పూర్తిగా కోలుకోవడానికి మూడు వారాల సమయం పడుతుందని, బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో అతను చికిత్స పొందుతాడని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. వన్డే సిరీస్లో మెరుగ్గా రాణించిన కేఎల్ రాహుల్.. పొట్టి ఫార్మాట్లోనూ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఇక తొలి రెండు టెస్టులకు తుది జట్టులో అతనికి స్థానం దక్కలేదు. మూడో టెస్ట్లో చోటు ఖాయమని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా గాయపడి జట్టుకు దూరమయ్యాడు.
ఇప్పటికే షమీ, ఉమేశ్లు గాయాలతో సిరీస్కు దూరమవగా.. ఆ జాబితాలో రాహుల్ కూడా చేరడం జట్టును కలవరపాటుకు గురిచేసింది. కానీ రోహిత్ శర్మ చేరికతో టీమిండియా జట్టు బలోపేతంగా కనిపిస్తుంది. గురువారం నుంచి జరగనున్న మూడో టెస్టు కోసం నేడు బీసీసీఐ తుది జట్టు ప్రకటించగా.. మయాంక్ స్థానంలో రోహిత్ను ఎంపిక చేయగా.. నవదీప్ సైనీ తుది జట్టులోకి వచ్చాడు.