విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా సత్తా చాటడంతోనే విజయం సాధించామని టీమిండియా తాత్కలిక వన్డే కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. సౌతాఫ్రికాతో రాంచీ వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన కేఎల్ రాహుల్.. ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో కాస్త కంగారు పడినట్లు తెలిపాడు.
'కడుపులో కంగారు లేదని చెబితే అబద్దం చెప్పినట్లే. చాలా కాలం తర్వాత మేం వన్డే క్రికెట్ ఆడాం. ఆశించిన ఫలితాన్ని అందుకున్నాం. వరుసగా వికెట్లు తీయడం మాకు కలిసొచ్చింది. మా బౌలర్లు ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేశారు. సఫారీ బ్యాటర్లు మమ్మల్ని ఒత్తిడికి గురి చేశారు. ఆఖరి వరకు అద్భుతంగా పోరాడారు. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడంపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. జట్టు కోసం నేను ఏదైనా చేయడానికి సిద్దమే. గత 2-3 సిరీస్ల్లో టీమిండియా మేనేజ్మెంట్ నాకు అప్పగించిన పాత్ర అదే. ఇది నా వ్యక్తిగత ఆట మెరుగుపడటానికి కూడా ఉపయోగపడుతుంది.

రోహిత్, కోహ్లీ చెలరేగి ఆడుతుంటే చూడటం చాలా సరదాగా ఉంటుంది. వారు తమ బ్యాటింగ్తో ప్రత్యర్థులను పిచ్చోళ్లను చేస్తారు. వారి బ్యాటింగ్ను నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా. డ్రెస్సింగ్ రూమ్లో వారు ఉంటే చాలా ఫన్గా ఉంటుంది. హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వికెట్లు తీసే సామర్థ్యం అతనికి ఉంది. హైట్ ఎక్కువగా ఉండటం అతనికి కలిసొచ్చే అంశం. ఆఖరి ఓవర్లలో ఎక్కువ పరుగులిచ్చినా.. జట్టును గెలిపించే సత్తా అతనికి ఉంది. అతను కొత్త బంతితో కూడా వికెట్లు తీయాలని ఆశిస్తున్నాం. కుల్దీప్ యాదవ్ తన పనిని తాను చేస్తున్నాడు. అతను వికెట్లు తీయడం మాకు కీలకం.'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్లతో 135) సెంచరీతో చెలరేగగా.. రోహిత్ శర్మ(51 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 57), కేఎల్ రాహుల్(56 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 60) హాఫ్ సెంచరీలతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్, నండ్రే బర్గర్, కార్బిన్ బోష్, ఒట్నిల్ బార్ట్మన్ రెండేసి వికెట్లు తీసారు.
అనంతరం సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ బ్రిట్జ్కే(80 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 72), మార్కో జాన్సెన్(39 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 70), కార్బిన్ బోష్(51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 67) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/68) నాలుగు వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా(3/65) మూడు వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ సింగ్(2/64)కు రెండు వికెట్లు దక్కాయి.