బెంగళూరు: కరోనా కారణంగా ఆటల్లేక ఇంటికే పరిమితమైన భారత క్రికెటర్లు భావోద్వేగానికి గురువుతున్నారు. ఎప్పుడెప్పుడు మైదానంలోకి అడుగుపెడ్తామా? అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య బయో బబుల్ వాతావరణంలో జరిగిన టెస్ట్ మ్యాచ్ సూపర్ సక్సెస్ కావడంతో తాము కూడా అతి త్వరలోనే మ్యాచ్ ఆడుతామని కలలు కంటున్నారు.
సోమవారం కేఎల్ రాహుల్ ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఓ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. రాహుల్ మనసులోని బాధను తెలియజేస్తుంది. తన క్రికెట్ కిట్ను ధీనంగా చూస్తున్నట్లు ఉన్న ఆ ఫొటో అభిమానుల మనసులను కదిలిస్తుంది. పైగా ఈ ఫొటోకు రాహుల్ 'ఐ మిస్ యూ'అని క్యాప్షన్గా పేర్కొంటూ భావోద్వేగానికి గురయ్యాడు. అయితే రాహుల్ మైదానంలోకి బరిలోకి దిగడానికి ఇంకా చాలా సమయం పట్టవచ్చు. ప్రస్తుతం దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు.. భారత క్రికెట్ను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
అయితే ఇంగ్లండ్-వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ సూపర్ సక్సెస్ కావడం సానుకూలాంశమే అయినా.. భారత్లో క్రికెట్ రీస్టార్ట్ కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు.. బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ మాట్లాడిన మాటలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి.
ఇతర దేశాల సంగతి ఎలా ఉన్నా భారత్లో మాత్రం ఇప్పటికిప్పుడు క్రికెట్ తిరిగి రావడం చాలా కష్టం. ఐపీఎల్పై బోర్డు ఎన్ని ఆశలు పెట్టుకుంటున్నా... అది అంత సులువు కాదు. ఇక ఇంగ్లండ్లాగా బయో బబుల్ తరహాలో అంటే అసాధ్యమనే చెప్పవచ్చు. గతంలోనే సౌరవ్ గంగూలీ చెప్పినట్లు కరోనా సమయంలో ఆటల నిర్వహణలో విదేశీ తరహా క్రమశిక్షణను మనం ఇక్కడ ఆశించలేం. చిన్న పొరపాటు ఏ స్థాయిలో జరిగినా అది మొత్తానికే నష్టం కలిగించవచ్చు. ఎలా చూసినా ఆస్ట్రేలియాలోనే భారత్ తమ తదుపరి సిరీస్ ఆడే అవకాశాలే ఎక్కువ.
వాళ్లవన్నీ ఉత్తమాటలే.. కెప్టెన్సీ ఎంజాయ్ చేశా: బెన్ స్టోక్స్