
ఓవల్: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో నిబంధనలను ఉల్లంఘించిన టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్పై జరిమానా విధించారు. డీఆర్ఎస్ తర్వాత అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకుగానూ అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. ఈ మేరకు ఐసీసీ రిఫరీ క్రిస్ బ్రాడ్ రాహుల్పై చర్యలు తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. మూడో రోజు ఆట తొలి సెషన్ 34వ ఓవర్లో ఆండర్సన్ బౌలింగ్లో బెయిర్స్టో క్యాచ్కు అప్పీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్గా ప్రకటించడంతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రివ్యూకి వెళ్లాడు. అందులో బంతి బ్యాట్ ఎడ్జ్కి తగిలినట్లు తేలడంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని రాహుల్ను ఔట్గా ప్రకటించాడు.
దీనిపై రాహుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో అతనిపై ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.8(అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడం) ఉల్లంఘన నేరం కింద జరిమానా విధించారు. దీంతోపాటు రాహుల్ క్రమశిక్షణ రికార్డ్లో ఒక డీమెరిట్ పాయింట్ను కూడా చేర్చారు. ఈ తప్పిదాన్ని రాహుల్ అంగీకరించాడు.
లెవల్ 1 స్థాయి ఉల్లంఘనకు పాల్పడిన ఆటగాడిపై 50 శాతం ఫీజు కోత విధించొచ్చు. ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయంట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. 24 నెలల వ్యవధిలో ఓ ఆటగాడిపై నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ డీమెరిట్ పాయింట్స్ ఉంటే అవి సస్పెన్షన్ పాయింట్లుగా మారుతాయి. ఆటగాడి బ్యాన్ చేస్తారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. నాలుగో రోజు లంచ్ విరామ సమయానికి 329/6 పరుగులతో నిలిచింది. ప్రస్తుతం 230 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో పంత్, శార్దుల్ ఠాకుర్ ఉన్నారు. ఈ రోజు భారత జట్టు బ్యాటింగ్ చేసిన దానిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. అంతకుముందు నాలుగో రోజు ఆటను 270/3 స్కోరుతో మొదలుపెట్టిన టీమ్ఇండియా.. ఆచితూచి బ్యాటింగ్ చేసింది. కోహ్లీ-జడేజా జోడీ నెమ్మదిగా స్కోరు బోర్డును కదిలించారు. అయితే వరుస విరామాల్లో కోహ్లీ(44), జడేజా(17), రహానే(0) ఔటయ్యారు.