సౌతాఫ్రికాతో మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుసగా 20 వన్డేల తర్వాత టీమిండియా టాస్ గెలవడంతో కెప్టెన్ కేఎల్ రాహుల్తో పాటు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు గట్టిగా అరుస్తూ రాహుల్కు మద్దతు తెలిపారు. టీమిండియా చివరి సారిగా వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో టాస్ గెలిచింది.
ఆ తర్వాత 20 వన్డేలు ఆడగా.. ఒక్క మ్యాచ్లోనూ టాస్ గెలవలేదు. ఎట్టకేలకు వైజాగ్ వేదికగా జరుగుతున్న తాజా వన్డేతో టాస్ ఓటములకు చెక్ పెట్టింది. టాస్ గెలవగానే రాహుల్..' హమ్మయ్యా.. టాస్ గెలిచాం'అని ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. గత రాత్రి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో డ్యూ కనిపించింది. అయితే రాంచీ, రాయ్పూర్ తరహాలో ముందుగానే డ్యూ వచ్చే అవకాశం లేదు. మేం ఛేజింగ్ చేయాలనుకుంటున్నాం. అయితే ముందుగా బౌలింగ్ ఎలా చేస్తామో చూడాలి. పిచ్ మంచిగా కనిపిస్తోంది. గత రెండు మ్యాచ్ల్లో మా ఆట తీరు పట్ల సంతోషంగా ఉన్నాం.

మాకు చాలా సానుకూలాంశాలు ఉన్నాయి. మా ఆటతీరును మార్చుకోవాల్సిన అవసరం లేదు. తుది జట్టులో ఒక మార్పు చేశాం. వాషింగ్టన్ సుందర్ స్థానంలో తిలక్ వర్మ బరిలోకి దిగుతున్నాడు. బ్యాటింగ్ డెప్త్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం.'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేసేవాళ్లమని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేసేవాళ్లం. మాకు మెరుగైన ఆరంభం లభిస్తే మిడిలార్డర్ బ్యాటర్లకు ఉపయోగపడనుంది. గత రెండు మ్యాచ్లు చాలా సరదాగా సాగాయి. ఈ మ్యాచ్కు ప్రేక్షకుల మద్దతు బాగా ఉంది. ఈ మ్యాచ్ కూడా ఉత్కంఠగా సాగుతుందని ఆశిస్తున్నా. జట్టులో రెండు మార్పులు చేశాం. ర్యాన్ రికెల్టన్, బార్ట్మన్ జట్టులోకి వచ్చారు. బర్గెర్, డీ జోర్జి రెండు వారాలు ఆటకు దూరమయ్యారు.'అని బవుమా చెప్పుకొచ్చాడు.
సౌత్ ఆఫ్రికా: ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్(కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, ఎయిడెన్ మార్క్రమ్, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బోష్, కేశవ్ మహరాజ్, లుంగీ ఎంగిడి, ఒట్నీల్ బార్ట్మన్.
భారత్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(కీపర్/కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.