టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో ఇంగ్లండ్ గడ్డపై 1000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఐదో బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్లు ఉన్న జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఓవర్సీస్ కండిషన్స్లో 1000 ప్లస్ రన్స్ చేసిన రెండో భారత ఓపెనర్గా నిలిచాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా మాంచెస్టర్ వేదికగా బుధవారం ప్రారంభమైన నాలుగో టెస్ట్లో కేఎల్ రాహుల్ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్(98 బంతుల్లో 4 ఫోర్లతో 46) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. యశస్వి జైస్వాల్తో కలిసి తొలి వికెట్కు 94 పరుగులు జోడించాడు. ఈ సిరీస్లో ఇప్పటికే అతను 400 ప్లస్ రన్స్ పూర్తి చేసుకున్నాడు.

ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్(1950) అగ్రస్థానంలో ఉండగా.. సచిన్ టెండూల్కర్(1575), సునీల్ గవాస్కర్(1352), విరాట్ కోహ్లీ(1033), కేఎల్ రాహుల్(1000 ప్లస్) కన్నా ముందున్నారు. సునీల్ గవాస్కర్ తర్వాతా ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్లో మూడు అంతకంటే ఎక్కవ ఓపెనింగ్ భాగస్వామ్యాలు అందించిన రెండో ఓపెనర్గా రాహుల్ రికార్డ్ సాధించాడు.
ఈ ఘనతను రాహుల్ రెండు సార్లు అందుకోవడం గమనార్హం. 2021లో రోహిత్తో కలిసి ఈ ఫీట్ సాధించిన రాహుల్.. యశస్వి జైస్వాల్తో తాజా పర్యటనలో ఈ రికార్డ్ అందుకున్నాడు. ఈ పర్యటనలో రాహుల్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. లార్డ్స్ టెస్ట్లో సెంచరీతో రాణించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 83 ఓవర్లలో 4 వికెట్లకు 264 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 58), సాయి సుదర్శన్(151 బంతుల్లో 7 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. కేఎల్ రాహుల్(98 బంతుల్లో 4 ఫోర్లతో 46), రిషభ్ పంత్(48 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 37) విలువైన పరుగులు చేశారు.
కెప్టెన్ శుభ్మన్ గిల్(12) విఫలమవ్వగా.. రవీంద్ర జడేజా(19 బ్యాటింగ్), శార్దూల్ ఠాకూర్(19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు తీయగా.. క్రిస్ ఓక్స్ ఓ వికెట్ తీసాడు. తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు.