
సెంచూరియన్: సౌతాఫ్రికాతో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్ట్లో టీమిండియా ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. పేస్, బౌన్స్ పిచ్లకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాటలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బాక్సింగ్ డే టెస్ట్ నేపథ్యంలో బీసీసీఐ టీవీతో మాట్లాడిన రాహుల్.. టీమ్ కాంబినేషన్పై హింట్ ఇచ్చాడు. 'టెస్టుల్లో చాలా జట్లు ఇప్పుడు ఐదుగురు బౌలర్ల కాంబినేషన్తో ఆడుతున్నాయి. ఎందుకంటే.. అన్ని జట్లు మ్యాచ్లోని ప్రత్యర్థి 20 వికెట్లు తీయాలని ఆశపడుతున్నాయి. టెస్టులో గెలవాలంటే వికెట్లు తీయడం ఒక్కటే దారిగా కనిపిస్తోంది. ఆ ప్లాన్తోనే మేము తొలి టెస్టులో ఆడతాం. ఆసియా వెలుపల దేశాల్లో ఈ వ్యూహం ఫలించే అవకాశం ఉంది'' అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.
ఐదుగురు బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ పేర్లు ఇప్పటికే దాదాపు ఖాయమవగా.. శార్ధూల్ ఠాకూర్, ఇషాంత్ శర్మలో ఒక్కరికే అవకాశం దక్కనుంది.
ఇక ఐదో స్థానంపై స్పందిస్తూ.. 'ప్రస్తుతం మా టెస్ట్ జట్టులో ఐదోస్థానం చాలా కీలకం. అయితే ఈ స్థానంలో రహానేను తప్ప వేరొకరిని ఊహించుకోలేం. తన టెస్టు కెరీర్లో ఎక్కువసార్లు ఐదోస్థానంలోనే వచ్చిన రహానే ఎన్నో మరిచిపోలేని ఇన్నింగ్స్లు ఆడాడు. పుజారాతో కలిసి మంచి భాగస్వామ్యాలు నమోదు చేసి ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక ఆసీస్ గడ్డపై గతేడాది మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఐదో స్థానంలో వచ్చిన రహానే సెంచరీ సాధించడమేగాకుండా జట్టుకు విజయాన్నిఅందించాడు.
ఇక ఇంగ్లండ్ పర్యటనలో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో పుజారాతో కలిసి ఆడిన ఇన్నింగ్స్...మ్యాచ్ గెలుపును ఎప్పటికి మరిచిపోము. కానీ 15-18 నెలల నుంచి రహానే తన ఫామ్ను కోల్పోయాడు. అంతమాత్రానికే రహానేను తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఆ స్థానంలో వేరొకరిని ఊహించుకోవడం వ్యర్థం. అయితే శ్రేయస్ అయ్యర్, హనుమ విహారీలు కూడా మంచి టెక్నిక్ ఉన్న బ్యాట్స్మన్. కానీ తుది జట్టులో ఎవరు ఉంటారన్నది చెప్పడం కష్టం. ఈ చర్చను ఇక్కడితో ముగిద్దాం. మరికొన్ని గంటల్లో తొలి టెస్టు ఆడే జట్టును ప్రకటిస్తారు'అంటూ రాహుల్ చెప్పుకొచ్చాడు.