టెయిలెండర్ హర్షిత్ రాణా దూకుడైన బ్యాటింగ్తోనే న్యూజిలాండ్తో తొలి వన్డేలో విజయం సాధించామని టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అన్నాడు. తీవ్ర ఒత్తిడిలో హర్షిత్ రాణా భారీ షాట్లు ఆడటం జట్టు విజయానికి కలిసొచ్చిందన్నాడు. ముఖ్యంగా అతని హిట్టింగ్ తనపై ఒత్తిడిని తగ్గించిందని తెలిపాడు.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా వడోదర వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 29 నాటౌట్) అద్భుతమైన ఫినిషింగ్తో టీమిండియా విజయాన్నందుకుంది. భారీ సిక్సర్తో రాహుల్ ఈ మ్యాచ్ను ముగించడం విశేషం.
301 పరుగుల భారీ లక్ష్య చేధనలో విరాట్ కోహ్లీ(91 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 93)క్రీజులో ఉండేవరకు టీమిండియా విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ జెమీసన్ కోహ్లీతో పాటు జడేజా, శ్రేయస్ అయ్యర్ను పెవిలియన్ చేర్చి మ్యాచ్ను ఉత్కంఠగా మార్చాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హర్షిత్ రాణా(23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 29) దూకుడుగా ఆడి విజయానికి బాటలు వేసాడు. అతను ఔటైనా సుందర్ సాయంతో రాహుల్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

ఈ విజయానంతరం మాట్లాడిన రాహుల్.. హర్షిత్ రాణాపై ప్రశంసల జల్లు కురిపించాడు. అతని హిట్టింగ్ వల్లే ఛేజింగ్ సులువైందని అభిప్రాయపడ్డాడు. 'హర్షిత్ రాణా అద్భుతంగా బ్యాటింగ్ చేసి నాపై ఒత్తిడి తగ్గించాడు. ముఖ్యంగా అతని హిట్టింగ్ వల్ల ఈ ఛేజింగ్ సులువైంది. లక్ష్యం పెద్దది కాకపోవడంతో నేను ప్రశాంతంగా ఆడాను. ఈ స్థాయిలో 90 శాతం సందర్భాల్లో ఓవర్కు 6 లేదా 6.5 పరుగులు చేయాలని జట్టు ఆశిస్తుంది.
గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ పరిగెత్తలేడనే విషయం నాకు తెలియదు. కానీ అతను బంతిని బాగా టైమ్ చేశాడు. డాట్ బాల్స్ పెరగకుండా మేం జాగ్రత్త పడ్డాం. పిచ్ 100 ఓవర్ల పాటు ఒకేలా ఉంది. కొత్త బంతితో బ్యాటింగ్ చేయడం ఈజీగా అనిపించింది. రోహిత్, గిల్, కోహ్లీ భాగస్వామ్యాలు సరైన వేగాన్ని అందించాయి. తర్వాత పిచ్ నెమ్మదించినప్పటికీ టాప్ బ్యాటర్లు మా పనిని సులువు చేశారు. న్యూజిలాండ్తో చాలా మ్యాచ్లు ఆఖరి ఓవర్ వరకు వెళ్లాయి. వారు ఎలాగైనా తిరిగి పుంజుకుంటారు. తదుపరి మ్యాచ్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.