సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్కు టీమిండియా సిద్దమైంది. ఆదివారం రాంచీ వేదికగా జరిగే తొలి వన్డేలో ఆతిథ్య భారత్, సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ శనివారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తుది జట్టు ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ ఎలెవన్ను ఇంకా ఖరారు చేయలేదని ఆదివారమే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. రిషభ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ ఆడే అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
'రుతురాజ్ గైక్వాడ్ అసాధారణమైన ఆటగాడు. మా టాప్ 5-6 డైనమిక్స్ చాలా స్థిరంగా ఉన్నాయి. కానీ రుతురాజ్ గైక్వాడ్ తనకు వచ్చిన అతి తక్కువ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. ఈ సిరీస్లో అతనికి తప్పకుండా అవకాశం దక్కుతుంది. తొలి వన్డే తుది జట్టుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మ్యాచ్కు ముందే ఫైనల్ చేయనున్నాం.

రిషభ్ పంత్ స్పెషలిస్ట్ బ్యాటర్గా బరిలోకి దిగుతాడు. అయితే తొలి వన్డే అతను ఆడుతాడా? లేదా? అనేది ఇంకా నిర్ణయించలేదు. ఒకవేళ అతను ఆడితే కీపింగ్ చేస్తాడు. ఇప్పటి వరకు అయితే తుది నిర్ణయం తీసుకోలేదు. నేను ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాను. 'అని కేఎల్ రాహుల్ తెలిపాడు.
స్పిన్ బౌలింగ్ ఆడటంలో భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని కేఎల్ రాహుల్ అంగీకరించాడు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపాడు. 'అవును.. గత కొన్ని సిరీస్లుగా మేం స్పిన్ బౌలింగ్ను బాగా ఆడలేకపోతున్నాం. మాకు తెలుసు. ఈ విషయాన్ని మేం అంగకరిస్తున్నాం. బలహీనతలను గుర్తించడం బ్యాటర్ల పని. సీనియర్ ఆటగాళ్లతో మాట్లాడి ఈ బలహీనతను అధిగమించే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే మా బ్యాటింగ్ను మెరుగుపర్చుకునేందుకు కావాల్సిన మార్గాలను అన్వేషిస్తున్నాం. అయితే రాత్రికి రాత్రే మా బలహీనతను అధిగమించలేం.'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.