న్యూఢిల్లీ: ట్రోలింగ్ అనేది ఆటగాళ్లను తీవ్రంగా దెబ్బ తీస్తోందని టీమిండియా స్టార్ ప్లేయర్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ట్రోలింగ్ కారణంగా తాను తీవ్రంగా బాధపడటంతో పాటు ఇతర ఆటగాళ్ల కూడా చాలా ప్రభావితమయ్యారని తెలిపాడు. తొడ కండరాల గాయంతో ఐపీఎల్ 2023 సీజన్కు దూరమైన కేఎల్ రాహుల్ శస్త్ర చికిత్స చేయించుకొని కోలుకుంటున్నాడు.
ఐపీఎల్ 2023 సీజన్లో రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. జిడ్డు బ్యాటింగ్తో అభిమానులను తెగ విసిగించాడు. దాంతో అతనిపై ఫ్యాన్స్ తెగ ట్రోలింగ్కు పాల్పడ్డారు. రాహుల్ త్వరగా ఔటైతేనే మేలని కామెంట్లు చేశారు. తాజాగా ఓ పోడ్కాస్ట్లో మాట్లాడిన కేఎల్ రాహుల్ను ట్రోలింగ్పై ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అందరిలానే ట్రోలింగ్కు పట్టించుకోకపోయినా కొన్నిసార్లు బాధపడిన సందర్భాలున్నాయని రాహుల్ చెప్పుకొచ్చాడు. 'హద్దులు ధాటిన ట్రోలింగ్ కొన్నిసార్లు బాధపెట్టింది. నేనే కాదు ఇతర ఆటగాళ్లు కూడా ట్రోలింగ్ వల్ల ఇబ్బంది పడ్డారు. అథ్లెట్స్గా మేం అభిమానుల మద్దతు ఆశిస్తాం. కానీ కొందరు మాత్రం ఆటగాళ్ల వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ తిట్టడమే వారి హక్కుగా భావిస్తారు.
ఏ ఆటగాడు కూడా కావాలని చెత్త ప్రదర్శన కనబర్చడు. క్రికెటే మా జీవితం. మేం చేసే పనే ఇది. క్రికెట్ తప్పా మరొకటి తెలియదు. నా ఆట పట్ల అంకితభావంతో లేనని, తగినంత కష్టపడటం లేదని ఎలా అంటారు. దురదృష్టవశాత్తు క్రీడల్లో కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవచ్చు. నాకు అలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి.'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా విఫలమైన కేఎల్ రాహుల్పై మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. అప్పటి నుంచి అదే తడబాటును కొనసాగిస్తున్న రాహుల్.. ఐపీఎల్లోనూ విఫలమయ్యాడు. ఇదే పాడ్కాస్ట్లో ధోనీ గురించి మాట్లాడిన రాహుల్.. అతని సారథ్యంలో ఆడటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు. కోహ్లీ, రోహిత్ సారథ్యం గురించి కూడా మాట్లాడాడు.
'ధోనీ నా మొదటి కెప్టెన్. అతని సారథ్యంలో ఆడటం నా అదృష్టం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఎలా ఉండాలో ధోనీ నుంచే నేర్చుకున్నా. జట్టును నడిపించడంతో పాటు ఆటగాళ్లతో సత్సంబంధాలు ఎలా కొనసాగించాలో తెలుసుకున్నా. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా అసాధారణ ప్రదర్శన కనబర్చింది. కోహ్లీ తన నాయకత్వంలో జట్టుకు దూకుడు అలవాటు చేయడంతో పాటు పిచ్చిగా ఆడేలా మార్పు తెచ్చాడు.
కోహ్లీ తన కెప్టెన్సీతో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాడు. జట్టును నడిపించడంలో ఓ ఉదాహరణగా నిలిచాడు. జట్టులో ఫిట్నెస్ సంస్కృతి తీసుకొచ్చిందే కోహ్లీ. అతని వల్లే మేం అందరి దృష్టిని ఆకర్షించాం. రోహిత్ శర్మ చాలా తెలివైన కెప్టెన్. అతని వ్యూహాలు అసాధారణం. మ్యాచ్కు ముందు ప్రణాళికలు రచించడంపై చాలా వర్క్ చేస్తాడు. అతనికి ప్రతీ ప్లేయర్ బలంతో పాటు బలహీనత తెలుసు. అతను గేమ్ను బాగా అర్థం చేసుకుంటాడు.'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.