
అసహనానికి గురయ్యా..
'క్రీజులో కుదురుకున్నాక ఔటైన ప్రతిసారీ నాకు చిరాకేస్తుంది. రెండోరోజు ఉదయం అత్యంత కీలకం. అందుకే తొలి సెషన్లో 70-80 పరుగులు చేయాలని ప్రణాళిక వేసుకున్నా. నేను చాలా సానుకూలంగా ఉన్నా. ఆపై ఊరించే హాఫ్ వ్యాలీకి ఔటై పరుగులు చేయనందుకు తీవ్ర అసహనానికి గురయ్యా.' అని రాహుల్ చెప్పుకొచ్చాడు. తొలి రోజు ప్రదర్శించిన ఆట, చేతిలో ఉన్న వికెట్లను చూస్తే భారత్ స్కోరు కనీసం 500 పరుగుల వరకు చేరగలదనిపించింది. అయితే ఇంగ్లండ్ బౌలర్లు చక్కటి ప్రదర్శనతో టీమిండియాను కట్టడి చేశారు. రాహుల్ వికెట్ తర్వాత భారత ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. 86 పరుగుల వ్యవధిలో భారత్ తమ చివరి 7 వికెట్లు కోల్పోయింది.

చెలరేగుతాం..
ప్రస్తుతం లార్డ్స్ టెస్టులో ఆధిపత్యం కోసం రెండు జట్లు ప్రయత్నిస్తున్నాయి. రెండో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 119/3తో ఉంది. కెప్టెన్ జో రూట్ (48*) అర్ధశతకానికి చేరువలో ఉన్నాడు. అతడికి జానీ బెయిర్స్టో (6*) అండగా నిలుచున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం త్వరగా వికెట్లు తీస్తే ఇంగ్లండ్పై పై చేయి సాధిస్తామని రాహుల్ పేర్కొన్నాడు. 'మ్యాచ్ ఫలితాన్ని ఇప్పుడే చెప్పలేం. జరగాల్సింది జరుగుతుంది. శనివారం త్వరగా వికెట్లు తీయాలన్నది మా ప్రణాళిక. ప్రతి బ్యాట్స్మన్పై వ్యూహాలు రచించాం. వాటిని కచ్చితత్వంతో అమలు చేస్తాం' అని రాహుల్ తెలిపాడు. రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి రావడంపై అతడు స్పందించాడు. సవాళ్లు ఎక్కడైనా ఉంటాయని అన్నాడు. వన్డేలతో పోలిస్తే సుదీర్ఘ ఫార్మాట్లో స్వింగ్ తక్కువగా ఉంటుందని అన్నాడు.

ఫామ్ అందుకుంటారు..
అజింక్యా రహానె, చతేశ్వర్ పుజారా ఫామ్పై తమకు ఆందోళనేమీ లేదని రాహుల్ పేర్కొన్నాడు. 'ఎన్నోసార్లు జట్టు కష్టాల్లో పడ్డప్పుడు పుజారా, రహానే ఆదుకున్నారు. వారు ప్రపంచ స్థాయి ఆటగాళ్లు. వారికెంతో అనుభవం ఉంది. వారు తిరిగి ఫామ్లోకి రావడానికి రెండు మూడు ఇన్నింగ్సులు చాలు. ఇంగ్లండ్లో ఆడటం ఎవరికైనా కష్టమే' అని రాహుల్ తెలిపాడు. తాజా మ్యాచ్లో కోహ్లీ కష్టం మీద 42 పరుగులు చేస్తే.. పుజారా (9), రహానే (1) రెండంకెల స్కోరునే అందుకోలేదు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో వీరి వైఫల్యం ఆందోళన రేకెత్తిస్తోంది. కానీ కోహ్లీ, రాహుల్ మాత్రం వీరిని వెనకేసుకొస్తున్నారు.

సంతోషం సగమే..
రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. జో రూట్ (75 బంతుల్లో 6 ఫోర్లతో 48 బ్యాటింగ్), బెయిర్స్టో (6 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. సిరాజ్ 2 వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 364 పరుగులవద్ద ఆలౌటైంది. తన ఓవర్నైట్ స్కోరుకు మరో 2 పరుగులే జోడించిన కేఎల్ రాహుల్ (250 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్తో 129 ) టీమ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. 86 పరుగుల వ్యవధిలో భారత్ తమ చివరి 7 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 5 వికెట్లతో చెలరేగడం విశేషం. ప్రస్తుతం భారత్దే పైచేయిగా కనిపిస్తున్నా... రూట్ నేతృత్వంలో ఇంగ్లండ్ మూడో రోజు ఎలాంటి పోరాట పటిమ ప్రదర్శించి ఇన్నింగ్స్లో ఆధిక్యం కోసం ప్రయత్నిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications
