ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్లో టీమిండియా డ్రా కోసం పోరాడుతోంది. శనివారం ఆట ముగిసే సమయానికి 63 ఓవర్లలో 2 వికెట్లకు 174 పరుగులు చేసింది. 311 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఒక్క పరుగు చేయకుండానే యశస్వి జైస్వాల్(0), సాయి సుదర్శన్(0) డకౌట్గా వెనుదిరిగారు. క్రిస్ వోక్స్ తన తొలి ఓవర్లోనే ఈ ఇద్దర్నీ స్లిప్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(210 బంతుల్లో 8 ఫోర్లతో 87 నాటౌట్), శుభ్మన్ గిల్(167 బంతుల్లో 10 ఫోర్లతో 78 నాటౌట్) జట్టును ఆదుకున్నారు.
మూడో వికెట్కు అజేయంగా 174 పరుగులు జోడించారు. భారత్ ఇంకా 137 పరుగుల వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 8 వికెట్లు కావాలి. భారత్ ఓటమి నుంచి గట్టెక్కాలంటే చివరి రోజు రెండున్నర సెషన్లు బ్యాటింగ్ చేయాలి. లేదంటే ఈ మ్యాచ్ ఇంగ్లండ్ వశమవుతోంది. ముఖ్యంగా తొలి సెషన్ను భారత్ ఆచితూచి ఆడాలి. టీమిండియా ఆటగాళ్లు క్లాస్ బ్యాటింగ్తో డ్రా కోసం మాత్రమే ప్రయత్నించాలి.

అంతకుముందు 544/7 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 157.1 ఓవర్లలో 669 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్ బెన్ స్టోక్స్(198 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లతో 141) సెంచరీతో చెలరేగగా.. బ్రైడన్ కార్స్(54 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(4/134) నాలుగు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా(2/112), వాషింగ్టన్ సుందర్(2/107) రెండేసి వికెట్లు పడగొట్టారు. అన్షుల్ కంబోజ్, మహమ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీసారు.
భారత్ తొలి ఇన్నింగ్స్ 358 ఆలౌట్( సాయి సుదర్శన్ 61, బెన్ స్టోక్స్ 5/72)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 669 ఆలౌట్(జోరూట్ 150, బెన్ స్టోక్స్ 141, జడేజా 4/143)
భారత్ రెండో ఇన్నింగ్స్: 174/2 (కేఎల్ రాహుల్ 82 బ్యాటింగ్, శుభ్మన్ గిల్ 78 బ్యాటింగ్, క్రిస్ వోక్స్ 2/48)