
న్యూఢిల్లీ: నిలకడలేమి ఫామ్తో సతమతమవుతున్న టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్.. దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. కెరీర్లో గడ్డు పరిస్థితుల నుంచి తనను గట్టెక్కించాలని పూజలు చేస్తున్నాడు. ఇటీవలే బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిని రాహుల్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సన్నిహితుల మధ్య మహరాష్ట్రలోని సునీల్ శెట్టి ఫామ్ హౌజ్లో ఈ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లి అనంతరం హనీ మూన్ కూడా వెళ్లని కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్నాడు. తొలి రెండు టెస్ట్ల్లో రాహుల్( 20, 17, 1) దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతన్ని జట్టు నుంచి తప్పించాలనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక ఢిల్లీ టెస్ట్ మూడు రోజుల్లోనే ముగియడంతో భారత ఆటగాళ్లకు బీసీసీఐ 6 రోజుల విశ్రాంతి కల్పించింది. దాంతో కేఎల్ రాహుల్ తన ఫ్యామిలీతో గడుపుతున్నాడు. తన సతీమణి అతియా శెట్టితో కలిసి ఇండోర్కు సమీపంలోనే ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నాడు. రాహుల్-అతియాతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.
ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్లో ప్రతిరోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకే శివుడికి భస్మా హారతి ఇస్తారు. ఈ కార్యక్రమంలో రాహుల్ - అతియా దంపతులు పాల్గొన్నారు. నవ్రగ్రహాల పూజ కూడా చేశారు. రాహుల్ నెత్తిన శని తాండవం చేస్తుండటంతో శని పూజ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇండోర్ వేదికగా మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్లో రాహుల్కు చోటు దక్కనుంది. చివరి అవకాశంగా తుది జట్టులోకి తీసుకోనున్నారు. ఈ మ్యాచ్లో విఫలమైతే రాహుల్ కెరీర్ ప్రమాదంలో పడినట్లే.
గతేడాది సౌతాఫ్రికాలో సెంచూరియన్ వేదికగా సెంచరీ చేసిన రాహుల్ ఆ తర్వాత ఒక్క ఇన్నింగ్స్ కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేదు. ఆ మ్యాచ్ తర్వాత రాహుల్ సగటు 15.90 మరి దారుణంగా ఉంది. గత 10 ఇన్నింగ్స్ల్లో రాహుల్ కనీసం 30 పరుగులు కూడా చేయలేకపోయాడు. రాహుల్ ఫామ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా.. కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్ అండగా ఉంటున్నారు.