ఫీల్డింగ్ తప్పిదాలతో పాటు పిచ్ కండిషన్స్కు తగ్గట్లు అదనపు పరుగులు చేయకపోవడం తమ ఓటమిని శాసించిందని టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. విపరీతమైన డ్యూ కారణంగా రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడం చాలా కష్టమైందని తెలిపాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా రాయ్పూర్ వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 4 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన కేఎల్ రాహుల్.. తమ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. బ్యాటింగ్లో మరో 20-25 పరుగుల అదనంగా చేయాల్సిందని, ఫీల్డింగ్ వైఫల్యం కూడా విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. లోయరార్డర్ బ్యాటర్లు ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సిందని అభిప్రాయపడ్డాడు. టాస్ ఓడిపోవడం కూడా ఓటమికి కారణమైందని తెలిపాడు. 'ఈ మ్యాచ్లో విపరీతమైన మంచు ఉంది. రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడం చాలా కష్టంగా మారింది. మా బాధను చూడలేక అంపైర్లు బంతిని కూడా మార్చారు. టాస్ కీలక పాత్ర పోషించింది.
టాస్ ఓడినందుకు ఈ ఓటమికి నేనే బాధ్యత తీసుకోవాలి. అయితే ఈ మ్యాచ్లో మేం ఇంకాస్త మెరుగైన ప్రదర్శన చేయాల్సింది. 350 పరుగులు మంచి స్కోర్. కానీ డ్యూ ఫ్యాక్టర్ నేపథ్యంలో మరో 20-25 పరుగులు అదనంగా చేయాల్సింది. ఫీల్డింగ్లో కూడా తప్పిదాలు చేశాం. కొన్ని పరుగులును ఆపలేకపోయాం.

రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. కోహ్లీ తన ట్రేడ్ మార్క్ బ్యాటింగ్ చూపించాడు. స్పిన్నర్లను రుతురాజ్ ఎదుర్కొన్న విధానం అద్భుతం. అతను వేగంగా ఆడటంతోనే మాకు 20 పరుగులు అదనంగా లభించాయి. లోయరార్డర్ మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. కండిషన్స్ నేపథ్యంలోనే నేను ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాను. విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ మంచి టెంపోను సెట్ చేశారు. ఆ జోరును నేను కొనసాగించాను. గత మ్యాచ్లో 50 పరుగులు చేయడంతో నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. దాంతో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడమే ఉత్తమమనిపించింది.'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 358 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ(93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 102), రుతురాజ్ గైక్వాడ్(83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 105) సెంచరీలతో చెలరేగగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 66 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్(2/63) రెండు వికెట్లు తీయగా.. నండ్రే బర్గర్(1/43), లుంగి ఎంగిడి(1/51) చెరో వికెట్ తీసారు.
అనంతరం సౌతాఫ్రికా 49.2 ఓవర్లలలో 6 వికెట్లకు 362 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్(98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 110) సెంచరీతో చెలరేగగా.. మాథ్యూ బ్రిట్జ్కే(64 బంతుల్లో 5 ఫోర్లతో 68), డెవాల్డ్ బ్రెవిస్(34 బంతుల్లో ఫోర్, 5 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.