
దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాట్స్మన్ మళ్లీ తడబడ్డారు. కోల్కతా బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయారు. దాంతో ప్రత్యర్థి ముందు ఆరెంజ్ ఆర్మీ 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 115 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(26), అబ్దుల్ సమద్(25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కోల్కతా బౌలర్లలో టీమ్ సౌథీ, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తీ రెండేసి వికెట్లు తీయగా.. షకీబ్ అల్ హసన్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే సన్రైజర్స్ హైదరాబాద్కు గట్టి షాక్ తగిలింది. టీమ్ సౌథీ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ రెండో బంతికే ఓపెనర్ వృద్దిమాన్ సాహా(0) గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్.. మరో ఓపెనర్ జాసన్ రాయ్తో కలిసి బాధ్యతాయుతంగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ శివమ్ మావి దెబ్బకొట్టాడు. జాసన్ రాయ్(10)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో ప్రియామ్ గార్గ్(21), విలియమ్సన్ నిదానంగా ఆడటంతో సన్రైజర్స్ పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 35 పరుగులే చేసింది. ఆ వెంటనే కేన్ విలియమ్సన్(26).. షకీబ్ సూపర్ ఫీల్డింగ్కు రనౌట్గా పెవిలియన్ చేరాడు.
దాంతో హైదరాబాద్ 38 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అభిషేక్ శర్మతో కలిసి ప్రియమ్ గార్గ్ వికెట్లు కాపాడుకునే ప్రయత్నం చేశాడు. కానీ అభిషేక్ శర్మ(6)ను షకీబ్ అల్ హసన్ స్టంపౌట్ చేశాడు. క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసిన ప్రియామ్ గార్గ్ను వరుణ్ చక్రవర్తీ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో అబ్దుల్ సమద్ మూడు భారీ సిక్స్లు బాదడంతో జట్టు స్కోర్ 100కు చేరువైంది. జోరు మీదున్న అబ్దుల్(25)ను సౌథీ ఔట్ చేయడంతో సన్రైజర్స్ కష్టాలు రెట్టింపయ్యాయి. ఆ తర్వాత వచ్చిన జాసన్ హోల్డర్(2), రషీద్ ఖాన్(8)లు కూడా విఫలమవడంత సన్రైజర్స్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది.