ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) తమ జోరును కొనసాగిస్తోంది. లీగ్ దశలో పూర్తి ఆధిపత్యం చెలాయించి టేబుల్ టాపర్గా నిలిచిన కేకేఆర్.. అదే జోరులో క్వాలిఫయర్-1లో సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తు చేసి దర్జాగా ఫైనల్ చేరింది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ కీలక పోరులో సమష్టిగా చెలరేగిన కేకేఆర్.. 8 వికెట్ల తేడాతో సన్రైజర్స్ను ఓడించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలింది. రాహుల్ త్రిపాఠి(35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 55) హాఫ్ సెంచరీతో రాణించగా.. హెన్రీచ్ క్లాసెన్(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 32), ప్యాట్ కమిన్స్(24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 30) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

నిప్పులు చెరిగిన స్టార్క్..
కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(3/34) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్.. 13.4 ఓవర్లలో 2 వికెట్లకు 164 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. వెంకటేశ్ అయ్యర్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 51 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 58 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. సన్రైజర్స్ బౌలర్లలో నటరాజన్, కమిన్స్ తలో వికెట్ తీసారు.
ఈ ఓటమితో తృటిలో ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకున్న సన్రైజర్స్ హైదరాబాద్.. శుక్రవారం చెన్నై జరిగే క్వాలిఫయర్-2లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

దూకుడైన ఆరంభం..
160 పరుగుల సాధారణ లక్ష్య చేధనకు దిగిన కేకేఆర్కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు రెహ్మానుల్లా గుర్బాజ్(23), సునీల్ నరైన్(21) దూకుడుగా ఆడారు. దాంతో ఆ జట్టు 3 ఓవర్లలోనే 40 పరుగులు చేసింది. దూకుడుగా ఆడుతున్న రెహ్మానుల్లా గుర్బాజ్ను నటరాజన్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్ది సేపటికే సునీల్ నరైన్ను కమిన్స్ ఔట్ చేశాడు. ఈ ఇద్దరి క్యాచ్లను విజయ్కాంత్ వియాస్కాంత్ అందుకోవడం గమనార్హం.
ఈ పరిస్థితుల్లోక్రీజులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు.

అయ్యర్స్ విధ్వంసం..
విజయ్కాంత్ బౌలింగ్లో 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్ను వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్ నేలపాలు చేశాడు. క్యాచ్ అందుకున్నప్పటికీ సహచర ఫీల్డర్ రాహుల్ త్రిపాఠి అతన్ని ఢీకొట్టడంతో బంతి నేలపాలు అయ్యింది. నటరాజన్ వేసిన ఆ మరుసటి ఓవర్లో శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన సునాయస క్యాచ్ను పాయింట్లో ట్రావిస్ హెడ్ నేలపాలు చేశాడు. ఈ రెండు అవకాశాలతో చెలరేగిన అతను భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
28 బంతుల్లో వెంకటేశ్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ట్రావిస్ హెడ్ బౌలింగ్లో అయ్యర్ వరుసగా 6, 4, 6, 6 బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.