టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో రిటైర్మెంట్ను వెనక్కు తీసుకోవాలని సునీల్ నరైన్ను గత 12 నెలలుగా రిక్వెస్ట్ చేస్తున్నామని రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆల్రౌండర్, వెస్టిండీస్ కెప్టెన్ రోవ్మన్ పోవెల్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా కేకేఆర్ తరఫున బరిలోకి దిగిన సునీల్ నరైన్.. విధ్వంసకర సెంచరీతో సరికొత్త చరిత్ర సృష్టించాడు.
కేకేఆర్ తరఫున సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా నిలవడమే కాకుండా ఐపీఎల్ చరిత్రలోనే హ్యాట్రిక్ వికెట్తో పాటు శతకం బాదిన మూడో ఆటగాడిగా.. తొలి కేకేఆర్ ప్లేయర్గా రికార్డ్ నమోదు చేశాడు. ఏ ఫార్మాట్లోనైనా సునీల్ నరైన్కు ఇదే తొలి శతకం. అయితే ఈ మ్యాచ్లో కేకేఆర్కు విజయం దక్కలేదు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది.

జోస్ బట్లర్ (60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్లతో 107 నాటౌట్) అజేయ శతకంతో పాటు రోవ్మన్ పోవెల్(13 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 26) విధ్వంసకర బ్యాటింగ్తో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోవ్మన్ పోవెల్.. తమ ప్రపంచకప్ ప్రణాళికలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో రిటైర్మెంట్ వెనక్కు తీసుకొని వెస్టిండీస్ జట్టుతో కలవాలని గత 12 నెలలుగా సునీల్ నరైన్ను రిక్వెస్ట్ చేస్తున్నామని, అతను మాత్రం తమ విన్నపాన్ని పట్టించుకోవడం లేదని చెప్పాడు. సునీల్ నరైన్ ఒప్పించేందుకు తమ ప్రయత్నాలను ఆపడం లేదని, అతని సన్నిహితులైన పోలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్ల సాయంతో ఒప్పించే ప్రయత్నం చేస్తున్నానని తెలిపాడు.
'గత 12 నెలలుగా సునీల్ నరైన్ను రిక్వెస్ట్ చేస్తున్నా. అతను మాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో నేను కీరన్ పోలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్ల సాయం కోరాను. టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపిక చేసేలోపు వారు నరైన్ను ఒప్పిస్తారని ఆశిస్తున్నా.'అని రోవ్మెన్ పోవెల్ తెలిపాడు. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది.