
ముంబై: సంజూ శాంసన్(49 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 54) హాఫ్ సెంచరీతో రాణించడంతో కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సంజూ కెప్టెన్సీ ఇన్నింగ్స్కు రియాన్ పరాగ్(12 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 19), హెట్మైర్(13 బంతుల్లో 2 సిక్స్లు, ఫోర్తో 27 నాటౌట్) మెరుపులు తోడవ్వడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో టీమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా.. శివం మావి, సునీల్ నరైర్, ఉమేశ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ దేవదత్ పడిక్కల్(2).. ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్, జోస్ బట్లర్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. ఉమేశ్ యాదవ్ ఓవర్లో మూడు బౌండరీలు బాదిన సంజూ పరుగుల వేగాన్నిపెంచాడు. దాంతో రాజస్థాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం జోస్ బట్లర్(22)ను టీమ్ సౌథీ పెవిలియన్ చేర్చాడు.
దాంతో రెండో వికెట్కు నమోదైన 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కరుణ్ నాయర్(13) కూడా విఫలమయ్యాడు. అనుకూల్ రాయ్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఇక అదే ఓవర్లో క్విక్ సింగిల్తో సంజూ 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రియాన్ పరాగ్ భారీ సిక్సర్తో దూకుడు కనబర్చాడు.
టీమ్ సౌథీ బౌలింగ్లో మరో సిక్సర్ బాదిన పరాగ్.. అదే జోరులో మరో షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. శివం మావి వేసిన మరుసటి ఓవర్లోనే సంజూ శాంసన్ సైతం భారీ సిక్సర్కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. 19వ ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు బాదిన హెట్మైర్.. చివరి ఓవర్లో ఓ బౌండరీ బాది 150 పరుగుల మార్క్ను ధాటించాడు.