ఐపీఎల్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ సీజన్లో ఆ జట్టు 6వ విజయాన్ని నమోదు చేసింది. కోల్కతా నైట్రైడర్స్తో మంగళవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. జోస్ బట్లర్(60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్లతో 107 నాటౌట్) ఒంటరి పోరాటంతో రాజస్థాన్ను గెలిపించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసింది. సునీల్ నరైన్(56 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్తో 109) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. రఘు వంశీ(18 బంతుల్లో 5 ఫోర్లతో 30), రింకూ సింగ్(9 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 20 నాటౌట్) రాణించారు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ రెండేసి వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 224 పరుగులు చేసి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. జోస్ బట్లర్ ఒంటరి పోరాటానికి రియాన్ పరాగ్(14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 34), రోవ్మన్ పోవెల్(13 బంతుల్లో 26) సహకారం అందించారు.
కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీ తలో రెండు వికెట్లు తీసారు. వైభవ్ అరోరాకు ఓ వికెట్ దక్కింది.
శుభారంభం లేకున్నా..
224 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(19)మరోసారి నిరాశపరిచాడు. దూకుడుగా ఆడే క్రమంలో వైభవ్ అరోరా బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్(12)ను హర్షిత్ రాణా క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్, జోస్ బట్లర్ ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్లకు 76 పరుగులు చేసింది. దూకుడుగా ఆడిన పరాగ్(34)ను హర్షిత్ రాణా క్యాచ్ ఔట్ చేయగా.. ధ్రువ్ జురెల్(2), రవిచంద్రన్ అశ్విన్(8), హెట్మైర్(0) దారుణంగా విఫలమయ్యారు.

బట్లర్ ఒంటరి పోరాటం..
మరోవైపు బట్లర్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోవ్మెన్ పొవెల్ సాయంతో అతను చెలరేగాడు. పోవెల్ కూడా భారీ సిక్సర్లు బాదడంతో రాజస్థాన్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. పోవెల్(26)ను నరైన్ ఔట్ చేసినా.. బౌల్ట్(0) రనౌట్ అయినా బట్లర్ చెలరేగాడు. హర్షిత్ రాణా వేసిన 19వ ఓవర్లో 6, 4, 6 బాది 19 పరుగులు పిండుకున్నాడు.
దాంతో ఆఖరి ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. వరుణ్ చక్రవర్తీ వేసిన చివరి ఓవర్లో తొలి బంతిని సిక్సర్ బాదిన బట్లర్..తర్వాతి 3 బంతులను డాట్ చేయడంతో ఉత్కంఠగా మారింది. ఐదో బంతికి క్విక్ డబుల్ తీసిన బట్లర్.. ఆఖరి బంతికి సింగిల్ తీసి మ్యాచ్ను ముగించాడు.