రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు. కోపంతో అంపైర్లపై నోరుపారేసుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో ఆదివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది.
అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. కోహ్లీ ఔటైన తీరుపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగుతోంది. కొందరు ఔటంటే.. మరికొందరు నాటౌట్ అంటూ అంపైర్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

అసలేం జరిగిందంటే..?
ఆర్సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా హర్షిత్ రాణా వేసిన మూడో ఓవర్లో విరాట్ కోహ్లీ(7 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 18) రిటర్న్ క్యాచ్గా వెనుదిరిగాడు. హై ఫుల్టాస్గా వేసిన ఈ బంతి కోహ్లీ ఛాతి కంటే ఎత్తులో రాగా.. అతను డిఫెండ్ చేశాడు. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి గాల్లోకి లేవగా.. హర్షిత్ రాణా అందుకున్నాడు. అంపైర్లు ఔట్ ఇవ్వగా.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకున్నాడు.
అయితే బంతి నడుము కంటే ఎత్తులో వచ్చినా కోహ్లీ క్రీజు బయట ఉన్నాడని, బంతి డిప్ అయ్యిందని పేర్కొంటూ థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఈ నిర్ణయంపై కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మైదానంతో వీడుతూ సహనం కోల్పోయిన కోహ్లీ.. అంపైర్ల వద్దకు వచ్చి నోరుపారేసుకున్నాడు. ఇక ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అంబటి రాయుడు, నవ్జ్యోత్ సింగ్ సిద్దూ వంటి మాజీ క్రికెటర్లు చెత్త అంపైరింగ్ అంటూ తప్పుబట్టగా.. హర్షా భోగ్లే, ఇర్ఫాన్ పఠాన్ వంటి వాళ్లు సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. అభిమానులు మాత్రం టెక్నాలజీలో తప్పు ఉందని, అంత ఎత్తులో వచ్చిన బంతి ఎలా డిప్ అవుతుందని ప్రశ్నిస్తున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(14 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 48), ఆండ్రీ రస్సెల్(20 బంతుల్లో 4 ఫోర్లతో 27 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. రమణ్దీప్ సింగ్(9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
ఆర్సీబీ బౌలర్లలో యశ్ దయాల్ (2/56), కామెరూన్ గ్రీన్(2/35) రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(1/40), లాకీ ఫెర్గూసన్(1/47) తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. విల్ జాక్స్(32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 55), రజత్ పటీదార్(23 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. దినేశ్ కార్తీక్(18 బంతుల్లో 3 ఫోర్లతో 24), కర్ణ్ శర్మ(7 బంతుల్లో 3 సిక్స్లతో 20) మెరుపులు మెరిపించారు.